వైసీపీ వర్సెస్ టీడీపీ: నారావారిపల్లెలో రాజధాని మద్దతు సభ, పోటీగా టీడీపీ నిరసన సభ
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాయి. చిత్తూరు జిల్లాలో ఆదివారం పోటాపోటీ సభలు నిర్వహిస్తోన్నాయి. తమ వాణిని గట్టిగా వినిపించేందుకు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. అయితే టీడీపీ కంచుకొట, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇలాఖాలో వైసీపీ సభ నిర్వహించడంపై టీడీపీ భగ్గుమంటోంది. పోటీగా నిరసన సభ నిర్వహిస్తామని చెబుతోంది.
నారావారిపల్లెలో సభ..
చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లెలో వైసీపీ బహిరంగ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. తన సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ చిప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సభా నిర్వహిస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా సభ ఉంటుందని.. ఇందులో మూడు రాజధానులతో కలిగే ప్రయోజనాలపై వైసీపీ నేతలు వివరిస్తారు. సభకు పలువురు మంత్రులు, ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు హాజరవుతారు.
నిరసన సభ..
అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నారావారిపల్లెలో సభ నిర్వహించడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. నారావారి పల్లె చంద్రబాబు నాయుడు స్వస్థలం అని విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ సభకు పోటీగా నిరసన సభ నిర్వహిస్తామని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఎన్టీఆర్ విగ్రహాం వద్ద నిరసన సభకు ఏర్పాట్లు కూడా చేసింది.
అనుమతి లేదు
టీడీపీ నిరసన సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం ఇక్కడ మరో ట్విస్ట్. అధికార పార్టీ సభకు అనుమతి ఇచ్చిన పోలీసులు.. తమ సభకు ఎందుకు పర్మిషన్ ఇవ్వరని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కావాలనే అనుమతి ఇవ్వలేదని మండిపడుతున్నారు. అయినాప్పటికీ నిరసన సభ నిర్వహిస్తామని భీష్మించుకొని కూర్చొన్నారు.
టెన్షన్.. టెన్షన్..
వైసీపీ మూడు రాజధానుల సభ, టీడీపీ నిరసన సభతో నారావారి పల్లెలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముందు జాగ్రత్త భారీగా పోలీసు బలగాలను మొహరించారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.