వచ్చే ఎన్నికల్లో పొత్తులుండవ్...త్వరగా ఎన్నికలు వస్తే మేలు:జగన్
Recommended Video
అమరావతి:పవన్ కళ్యాణ్ మద్దతు గురించి తన వద్దకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని...అయినా ఎవ్వరి మద్దతూ లేకుండానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే సత్తా తమ పార్టీకి ఉందని వైసిపి అధినేత జగన్ స్పష్టం చేశారు. ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జగన్ వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి 2004 ఎన్నికల్లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని విజయపథాన నడిపించారు. ఆయన కుమారుడు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రి బాటలోనే 'ప్రజా సంకల్పం' పేరుతో పాదయాత్ర చేస్తూ ఇప్పటికి 200 రోజులు పూర్తి చేసిన సంగతి తెలిసిందే...ఈ నేపథ్యంలో ఆయనను ఒక ఆంగ్ల జాతీయ పత్రిక ఇంటర్వ్యూ చేసింది. అందులో ప్రధానాంశాలు...
పాదయాత్రలో...నేను గమనించినవి
ఈ పాదయాత్రలో ప్రతి రోజూ నాకు ఒక కొత్త అనుభవమే...ఈ అనుభవం నుంచి నేను ప్రతిరోజూ ఎంతో నేర్చుకుంటున్నాను. బహుశా నాకు ఎదురయ్యే మనుషులు మారొచ్చు...కానీ వారి దీన స్థితిగతులు మాత్రం మారలేదు. కొన్ని చోట్ల వారి పరిస్థితుల్లో కొంత తేడా ఉండొచ్చు. గత నాలుగేళ్లుగా సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు. అప్పుల భారాన్ని మోస్తూ సతమతం అవుతున్నారు. నిరుద్యోగ సమస్య బాగా ఎక్కువగా ఉంది. మొత్తం ఆర్థిక వ్యవస్తే కుప్పకూలి పోయింది. గ్రామాల్లో ప్రజాస్వామ్యమనేదే లేదు. టీడీపీ నేతలతో నింపేసిన జన్మభూమి కమిటీలు స్థానిక ప్రభుత్వాల అధికారాలన్నింటినీ హరించి వేశాయి. పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలన్నా చివరకు మరుగుదొడ్లు మంజూరు చేయాలన్నా...ఈ కమిటీలు టీడీపీ నేతల ద్వారా వెళ్లే వారికి మాత్రమే ఇస్తున్నాయి. ప్రజల చేత ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన సర్పంచ్లు అధికారాలు లేక ఉత్సవ విగ్రహాల్లా మిగిలి పోయారు.
అవినీతి...పెచ్చుమీరిపోయింది
గ్రామ స్థాయిలో అవినీతి పెచ్చరిల్లిపోయింది...గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను మొత్తం లూటీ చేశారు...అధికారుల సమక్షంలోనే వారికి తెలిసే ఇసుక మాఫియా ఇసుకను తవ్వి దోచుకుంటోంది...కేవలం టీడీపీ బినామీలు మాత్రమే ఉచితంగా ఇసుకను తీసుకెళుతున్నారు.ఈ ఇసుక దోపిడీలో కలెక్టర్లు కూడా భాగస్వాములుగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, ఆయనకు చెందిన హెరిటేజ్ కంపెనీ కూడా ఈ లూటీలో భాగస్వాములే. మట్టిని కూడా వారు వదలడం లేదు. బొగ్గు సరఫరా, విద్యుత్ కొనుగోళ్లు, మద్యం వ్యాపారం ఇలా అన్నింట్లోనూ భారీ కుంభకోణాలున్నాయి. వారు ఆలయాలను, ఆలయాలకు చెందిన భూములను కూడా వదలడం లేదు.
రాష్ట్రానికి...20 లక్షల కోట్లు పెట్టుబడులా...
రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు పదే పదే చెప్పుకుంటున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రానికి గత నాలుగేళ్లలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు కూడా రాలేదని వైఎస్ జగన్ చెప్పారు. చంద్రబాబునాయుడు పరిపాలన అధ్వానంగా ఉన్నందువల్ల ఉత్పన్నమైనవే. రూ 87,612 కోట్ల రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు గత నాలుగేళ్లలో సగటున ఏటా మాఫీ చేసిందల్లా రూ.3,000 కోట్లు మాత్రమే.
ప్రత్యేక హోదానే...పరిష్కారం
నిరుద్యోగులందరికీ ఉద్యోగాలిస్తాను.. జాబు కావాలంటే బాబు రావాలి అనే నినాదంతో ఆయన అధికారంలోకి వచ్చారు. హామీ ఇచ్చినట్లుగా ఆయన ఎవ్వరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు.. ఇస్తానన్న నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. మన యువతకు ఉద్యోగాలు రాగలిగే అవకాశం ఉండేది కేవలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్లనే. ప్రత్యేక హోదా వస్తే జీరో ఆదాయపు పన్నుతో పాటు పరిశ్రమలకు జీఎస్టీ మినహాయింపులు వచ్చి ఉండేవి. కానీ ప్రత్యేక హోదా రాలేదు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో గానీ, జాతీయ స్థాయిలో గానీ ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని జగన్ ఈ ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని ఏ పార్టీ లేదా ఫ్రంట్ అయితే లిఖిత పూర్వకంగా అంగీకారం తెలుపుతుందో వారికే కేంద్రంలో మద్దతు ఇస్తామని పునరుద్ఘాటించారు.
పొత్తులు ఉండవు...మాకు నష్టం లేదు
పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చే విషయమై మాజీ ఎంపి వరప్రసాద్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా...ఆయన మద్దతు గురించి నాకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని, ఎవ్వరి మద్దతూ లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే సత్తా తమ పార్టీ ఉందన్నారు." ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి మద్దతు కోసం, లేదా పొత్తు కోసం ఇప్పుడు, ఈ దశలో ఆలోచించే అవసరం మాకు ఉందని భావించడం లేదు. బహుముఖ పోటీ ప్రభావం మా పార్టీ విజయావకాశాలపై ఏ మాత్రం ఉండదు. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, బీజేపీ మద్దతుదార్లు ఇద్దరూ కూడా టీడీపీకే ఓట్లేశారు. ఆ పార్టీలన్నీ అప్పుడు కలిసి పోటీ చేసినందువల్లే అది సాధ్యమైంది. ప్రస్తుతం ఆ పార్టీలు రెండూ టీడీపీ ఓట్లనే చీల్చుతాయి తప్ప వైఎస్సార్ కాంగ్రెస్ ఓట్లను కానే కాదని" జగన్ విశ్లేషించారు.
ఓటమి కారణాలు...ఈసారి ఇలా!
గత ఎన్నికల్లో మేం కేవలం 1.5 శాతం ఓట్ల తేడాతో అధికారంలోకి రాలేకపోయాం...తనకు తాను అనుభవజ్ఞుడిగా చంద్రబాబు చెప్పుకోవడంతో పాటుగా ఆయన ప్రజలకిచ్చిన అబద్ధపు హామీలు, పవన్ కళ్యాణ్ మద్దతు, దేశంలో వీచిన నరేంద్ర మోదీ గాలి...ఇవన్నీ అప్పట్లో వైసిపి ఓటమికి కారణాలయ్యాయి. కానీ నేడు రాష్ట్రంలో వాతావరణం వేరుగా ఉంది. చంద్రబాబు పెద్ద అబద్ధాల కోరు అనే విషయాన్ని ప్రజలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన సైకిల్ నుంచి మోదీ, పవన్ కళ్యాణ్ అనే చక్రాలు వేరు పడ్డాయి. అధికారంలోకి వచ్చాక మేమేం చేస్తామో...నవరత్నాలు కార్యక్రమం ద్వారా చెబుతున్నాం. అదే సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణ పాలనను తీసుకు వస్తామని ప్రజలకు చెబుతున్నాం.
ముందస్తు మేలు...ఆసక్తి లేదు
ముందస్తు ఎన్నికల గురించి నేను ఇప్పటికైతే ఏమీ ఆలోచించడం లేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా పాదయాత్రపైనే. అయితే.. త్వరగా ఎన్నికలు జరగడం అనేది మాకూ, ఈ రాష్ట్రానికి చాలా మేలు చేస్తుంది. రాబోయే ఎన్నికలకు అదనంగా ఏర్పాట్లు చేసుకోవడం అనేది అవసరం లేదు. జాతీయ స్థాయిలో ఏదైనా ఫ్రంట్లో గాని, మిత్రపక్షాల కలయికలో గాని చేరాలన్న ఆసక్తి నాకు లేదు. జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించాలన్న కోరికా లేదు.