year ender 2020 : నిమ్మగడ్డ వర్సెస్ జగన్ పోరు- ఇద్దరూ గెలిచారా ? ఎలా అంటే
ఏపీలో ఈ ఏడాది కరోనా కారణంగా స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడిన తర్వాత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రభుత్వం మీద ప్రభుత్వం ప్రకటించిన యుద్ధం ఈ ఏడాది హైలెట్గా నిలిచింది. ప్రభుత్వానికీ, నిమ్మగడ్డకూ మధ్య సాగిన ముఖాముఖీ పోరులో నిమ్మగడ్డ పదవి నిలబెట్టుకోగా.. ప్రభుత్వం ఈ ఏడాది ఆయన నేతృత్వంలో స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించకుండా విజయవంతంగా అడ్డుకోగలిగింది. దీంతో ఇరువురూ తమ పరిధిలో విజయవంతంగానే ఈ ఏడాది ముగించినట్లు అర్ధమవుతోంది. స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణలో నిమ్మగడ్డ వేసిన అడుగులను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం కూడా తన మొండిపట్టును తుదికంటా కొనసాగించగలిగింది.
స్ధానిక పోరు వాయిదాతో జగన్కు షాక్..
ఈ ఏడాది ఎలాగైనా స్ధానిక సంస్ధల ఎన్నికలు జరిగిపోవాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు హైకోర్టు, మరోవైపు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కూడా భావించడంతో ఫిబ్రవరిలో ఈ ప్రక్రియ మొదలైంది. ముందుగా పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో మొదలైన ఈ ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో టీడీపీ, వైసీపీ మధ్య దాడులు, ప్రతిదాడులు కూడా కొనసాగాయి. ఎన్నికలు వాడీవేడిగా సాగిపోతున్న తరుణంలో అర్ధాంతరంగా ఓ రోజు ప్రెస్మీట్ పెట్టి కరోనా కారణంగా స్ధానిక సంస్ధల ఎన్నికలు ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన ప్రకటన సీఎం జగన్తో పాటు వైసీపీ ప్రభుత్వానికీ భారీ షాకిచ్చింది.
నిమ్మగడ్డపై జగన్ మాటల తూటాలు..
జోరుగా సాగిపోతున్న స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియను నిమ్మగడ్డ రమేష్ వాయిదా వేశారని తెలియగానే ప్రభుత్వం భగ్గుమంది. ముఖ్యంగా అప్పటివరకూ అధికారం చేపట్టాక ప్రెస్మీట్లే నిర్వహించని సీఎం జగన్ తొలిసారి మీడియా ముందుకొచ్చారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్ ఆయనకు మేలు చేసేందుకే కరోనా పేరుతో స్ధానిక పోరును వాయిదా వేశారంటూ జగన్ సంచలన విమర్శలు చేశారు. నిమ్మగడ్డ నిర్ణయం కచ్చితంగా టీడీపీకి మేలు చేసేందుకే అని జగన్ ఆరోపించారు. స్ధానిక పోరు వాయిదాతో నిమ్మగడ్డ భారీ కుట్రకు తెరలేపారని జగన్ చేసిన ఆరోపణలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి.
ఆర్డినెన్స్తో నిమ్మగడ్డ తొలగింపు...
కరోనా పేరుతో స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగించేందుకు వైసీపీ సర్కారు ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. చట్టాల్లో లొసుగులు చూపుతూ నిమ్మగడ్డను తొలగించి ఆయన స్ధానంలో తమిళనాడు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ను తీసుకొచ్చింది. అయితే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పోరాటం తర్వాత వైసీపీ ప్రభుత్వ నిర్ణయం తప్పని తేలింది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ చెల్లదని కోర్టులు నిర్ధారించడంతో వైసీపీ ప్రభుత్వం ఆయన్ను తిరిగి పదవిలో నియమించక తప్పలేదు. దీంతో నిమ్మగడ్డ అనతికాలంలోనే తిరిగి ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు.
స్ధానిక పోరుపై జగన్ వర్సెస్ నిమ్మగడ్డ
కోర్టు తీర్పుతో మళ్లీ ఎన్నికల కమిషనర్ అయిన నిమ్మగడ్డ రమేష్ కరోనా కూడా కాస్త శాంతించడంతో స్ధానిక పోరుకు సిద్దమయ్యారు. కానీ గతంలో ఎన్నికలు వాయిదా వేయడాన్ని వ్యతిరేకించిన వైసీపీ సర్కారు ఇప్పుడు ఎన్నికలు పెట్టొద్దంటూ కొత్త రాగం అందుకుంది. అలాగే నిమ్మగడ్డ కూడా అప్పట్లో ఎన్నికలు వాయిదా వేసి ఇప్పుడు ఎన్నికలకు రెడీ అంటూ సంకేతాలు ఇచ్చారు. దీంతో ఇరువురి మధ్యా మాటలు, చేతల యుద్ధం కొనసాగుతోంది. అయినా హైకోర్టు ఆదేశాలతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ రెడీ అవుతున్నారు. కానీ ఆయన పదవీకాలం మార్చితో ముగియబోతోంది. దీంతో ఏం జరగబోతోందనే ఉత్కంఠ ఇప్పుడు కొనసాగుతోంది.
Recommended Video
జగన్ నిమ్మగడ్డ పోరులో గెలిచిందెవరు ?
ఈ ఏడాది స్ధానిక సంస్ధల ఎన్నికల వాయిదా తర్వాత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగించినా తిరిగి న్యాయపోరాటంతో పదవి నిలబెట్టుకున్న నిమ్మగడ్డ రమేష్ ఓ రకంగా గెలిస్తే, ఆయన హయాంలో తిరిగి ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం మరో రకంగా గెలిచినట్లయింది. అయితే వచ్చే ఏడాది జరిగే పరిణామాలు వీరిద్దరి పోరులో అంతిమ విజేత ఎవరో తేల్చబోతున్నాయి. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అనుకున్నట్లు ప్రారంభమై మార్చిలో నిమ్మగడ్డ రిటైర్ కావాల్సిన పరిస్ధితి వస్తే కోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతుందన్న దానిపై ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.