year ender 2020 : కాషాయం తోడున్నా కలిసి రాని కాలం- జనసేన మరింత పతనం
ఏపీలో గతేడాది ఎన్నికల్లో దారుణ పరాజయాలు చవిచూసిన బీజేపీ, జనసేన పార్టీలు ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు జత కట్టాయి. అయితే ఈ ఏడాది ఆరంభంలో స్ధానిక సంస్ధల ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో కరోనా ప్రభావం మొదలు కావడం, ఎన్నికలు వాయిదా పడటం తదనంతర పరిణామాల్లో బీజేపీతో పోలిస్తే జనసేన పార్టీ మరింత పతనమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తోడున్నా జనసేన క్షేత్రస్ధాయిలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. త్వరలో జరిగే తిరుపతి ఉప ఎన్నికల్లోనూ ప్రభావం చూపలేకపోతే జనసేన బీజేపీకి కూడా దూరం కావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
జనసేనకు వర్కవుట్ కాని బీజేపీ పొత్తు
ఈ ఏడాదిలో ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారాలనే భారీ ఆశలతో పొత్తు పెట్టుకున్న బీజేపీ-జనసేనకు కాలం కలిసి రాలేదు. ఎన్నికలు పూర్తయి ఏడాది కూడా గడవకపోవడంతో ప్రజల్లోకి ప్రభుత్వ వ్యతిరేకతతో దూసుకెళ్లాలన్న ఇరుపార్టీల లక్ష్యం నెరవేరలేదు. అన్నింటి కంటే మించి బీజేపీ-జనసేన పార్టీలు కలిసి క్షేత్రస్ధాయిలో చేసిన ఉద్యమాలు ఎన్ని అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. జనసేనాని పవన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కానీ, ఆ తర్వాత వచ్చిన సోము వీర్రాజుతో కానీ క్షేత్రస్దాయిలో కనిపించకపోవడం ఇరు పార్టీల శ్రేణుల్ని నిరాశపరిచింది. దీంతో కేవలం పేపర్ మీదే పొత్తు కానీ జనంలో కాదన్నట్లుగా వీరి పరిస్ధితి మారింది.
బీజేపీ పొత్తుతో జనసేన పతనం..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఏపీలో ధీమాగా జనంలోకి వెళ్లొచ్చన ఆలోచనతో ముందుకొచ్చిన జనసేనకు అది ధృతరాష్ట్ర కౌగిలి అన్న విషయం తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. ముఖ్యంగా స్ధానిక సంస్ధల ఎన్నికల సమయంలోనే బీజేపీ కోరినన్ని సీట్లు ఇవ్వక తప్పని పరిస్ధితి జనసేనకు తలెత్తింది. జనసేనతో పోలిస్తే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అయినా బీజేపీకి కాస్తో కూస్తో పట్టు ఉండటమే ఇందుకు కారణం. ఆ తర్వాత కూడా తాజాగా జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కోరిక మేరకు ఆ పార్టీకి మద్దతిచ్చిన జనసేన.. ఇప్పుడు తిరుపతిలోనూ బీజేపీ అభ్యర్ధికి మద్దతివ్వాల్సిన పరిస్ధితుల్లో నెలకొంది.
జనసేన శ్రేణుల్లో నిరాశ
బీజేపీ పొత్తుతో తమ పార్టీ బలోపేతం అవుతుందని భావించిన జనసేన కార్యకర్తలకు అధినేత పవన్ కళ్యాణ్ వరుస షాక్లు ఇస్తున్నారు. తొలుత ఏపీ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో, ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, ఇప్పుడు తిరుపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులకు జనసేన మద్దతివ్వాల్సి రావడం పార్టీ శ్రేణుల్లో నిరాశ నింపుతోంది. ఇలా ప్రతీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిస్తూ వెళితే ఇక తాము 2024 ఎన్నికల వరకూ ఆగాల్సిందేనా అన్న మీమాంశ వారిలో నెలకొంది. ఓవైపు క్షేత్రస్దాయిలో బీజేపీ చేపట్టే కార్యక్రమాలకు మద్దతిస్తూ, మరోవైపు ఎన్నికల్లోనూ ఆ పార్టీకే మద్దతిస్తే ఇక తామెప్పుడు పోటీ చేయాలని జనసేన క్యాడర్ ప్రశ్నిస్తోంది.
అమరావతిపైనా అదే నిరాశ...
జనసేన భారీగా ఆశలు పెట్టుకున్న అమరావతి ఉద్యమం విషయంలో ఆ పార్టీ దూకుడుగా ముందడుగు వేయలేకపోయింది. దీనికి ప్రధాన కారణం మిత్రపక్షం బీజేపీనే. ఓవైపు కేంద్ర ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో వైసీపీ సర్కారుకు మద్దతుగా హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేస్తుంటే.. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం అమరావతే మా రాజధాని అంటూ ప్రెస్మీట్లలో చెబుతున్నారు. దీంతో అమరావతిపై ఒంటరిగా ఉద్యమం చేయలేక, అలాగని మౌనంగా ఉండలేక జనసేనకు చుక్కలు కనిపిస్తున్నాయి. కేంద్రం నుంచి క్లారిటీ తీసుకున్నామంటూ జనసేనాని పవన్ పదేపదే చెబుతున్నా అమరావతిలో జనసేనను నమ్మే వారే కరువయ్యారు. దీంతో ఈ ఏడాది బీజేపీ పొ్త్తుతో జనసేన పరిస్ధితి రెంటికి చెడ్డ రేవడిగా మారిపోయింది.