year ender 2020- ఏపీలో తేలని మూడు రాజధానుల కథ- కొత్త ఏడాదిపై ఆశలు
ఏపీలో మూడ రాజదానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం గతేడాది డిసెంబర్లో ప్రారంభించిన ప్రక్రియ ఇప్పటికీ న్యాయవివాదాల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ప్రస్తుత రాజధాని అమరావతి రైతుల ఆగ్రహంతో పాటు విపక్షాల వ్యతిరేకతే ఇందుకు కారణం. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు, విపక్షాలు చేస్తున్న న్యాయపోరాటంతో ఈ ప్రక్రియ ప్రారంభమై ఏడాది గడుస్తున్నా ముందడుగు పడలేదు. కనీసం సీఎం జగన్ ఒంటరిగా అయినా విశాఖ వెళ్లి పాలన మొదలుపెట్టేందుకు వీలు దొరకలేదు. దీంతో కొత్త ఏడాదిలో మూడు రాజధానుల ప్రక్రియ కొలిక్కి వస్తుందని అటు ప్రభుత్వం, ఇటు రైతులు, విపక్షాలు కూడా ఆశాభావంగా ఉన్నాయి.
కసరత్తు లేకుండానే భారీ ప్రక్రియకు శ్రీకారం
ఏపీలో గతేడాది డిసెంబర్లో ఏమాత్రం కసరత్తు లేకుండా మూడు రాజధానుల ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం .. ప్రకటన అనంతరం దాన్ని సమర్ధించుకునే మార్గాలు వెతకడం మొదలుపెట్టింది. ఇందులో భాగమే జీఎస్రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు రిపోర్ట్, అసెంబ్లీ తీర్మానం. రాష్ట్రంలో మూడు రాజధానలు రావొచ్చేమో అంటూ సీఎం జగన్ గతేడాది డిసెంబర్లో ప్రకటించి ఆ తర్వాత ఈ నివేదికల కోసం కమిటీలను నియమించడం ద్వారా తాము ఎలాంటి హోం వర్క్ చేయలేదని చెప్పకనే చెప్పేశారు. దాని ఫలితమే శాసన, కార్యనిర్వాహక ప్రక్రియలు ముగిసిన తర్వాత న్యాయ వ్యవస్ధలో పడుతున్న బ్రేకులు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మూడు రాజధానులకు బ్రేకులు
రాజధానిగా ఉన్న అమరావతి స్ధానంలో వికేంద్రీకరణ పేరుతో మూడు రాజదానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తే అందుకు సవాలక్ష మార్గాలు ఉన్నాయి. అసలు ఇవేవీ ముట్టుకోకుండానే ముఖ్యమంత్రి తనకు నచ్చిన చోట నుంచి పాలించే వీలుంది. చేంద్రబాబు నిర్మించిన సచివాలయం నుంచి కాక తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ పాలిస్తున్నట్లుగానే విశాఖ నుంచి పాలించే అవకాశం రాజ్యాంగం కల్పించింది. అయినా దీన్నో పెద్ద తంతుగా మార్చి మూడు రాజధానుల కోసం జగన్ సర్కారు పడిన ఆరాటం ఈ మొత్తం ప్రక్రియనే ప్రశ్నార్ధకంగా మార్చింది. అమరావతి నుంచి రాజధాని తరలి పోతుందనే ఆగ్రహంతో రైతులు, స్ధానికులు ఉద్యమాలు చేస్తుంటే విపక్షాలు కూడా వీరికి తోడై హైకోర్టులో వరుస కేసులు వేయటంతో ఈ ప్రక్రియకు బ్రేకులు పడటం మొదలైంది.
నిర్ణయాన్ని సమర్ధించుకోని స్ధితిలో సర్కార్
ప్రభుత్వాలు తమకు ప్రజలు అప్పగించిన అధికారంలో రాజ్యాంగానికి లోబడి ఎలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు అయినా వీలుంది. అయితే రాజ్యాంగంలో ఇచ్చిన వెసులుబాట్లు, లొసుగులపై ఆయా ప్రభుత్వాలకు అవగాహన తప్పనిసరి. ఈ దూరదృష్టి లోపించడం వల్లే ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోగలిగింది కానీ ఇప్పటికీ దాన్ని సమర్ధించుకోలేని పరిస్ధితుల్లో ఉంది. అమరావతిపై పిచ్చికుక్క ముద్ర వేయడానికి చేసిన ప్రయత్నాలతో మొదలుపెడితే రాజధాని ఖర్చు వరకూ ఏ విషయంలోనూ ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా పోయింది. దీంతో సహజంగానే కోర్టుల్లోనూ వికేంద్రీకరణ అవసరాన్ని ప్రభుత్వం గట్టిగా సమర్ధించుకోలేకపోతోంది.
న్యాయపోరాటంతో మరింత ఆలస్యం
అమరావతి స్ధానంలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది. అసెంబ్లీ, గవర్నర్ ఆమోదించి చట్టాలుగా మారిన రాజధాని బిల్లులకు హైకోర్టు బ్రేకులు వేసింది. అయితే ఈ కేసులు విచారిస్తున్న ఛీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి తాజాగా బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసుల విచారణకు మరో బెంచ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కొత్త ఛీఫ్ జస్టిస్ గోస్వామి వచ్చాక దీన్ని ఏర్పాటు చేస్తారు. ఆ ధర్మాసనం తిరిగి ఈ కేసులను మొదటి నుంచి వినాలని భావిస్తే ఈ ప్రక్రియ మరింత ఆలస్యం కావొచ్చు. పిటిషన్లు వేసిన రాజదాని రైతులకు భారీగా ఖర్చూ తప్పదు. అందుకే ప్రస్తుత సీజే మహేశ్వరిని బదిలీ చేయొద్దంటూ వారు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. అయినా ఈ బదిలీ ఆగకపోవడంతో తిరిగి ఈ కేసులు మొదటికొస్తాయని భావిస్తున్నారు
కొత్త ఏడాదిపై ప్రభుత్వం, రైతుల ఆశలు..
ఏడాది కాలంగా అమరావతే రాజధానిగా ఉండాంటూ రైతులు, మూడు రాజధానులే ముద్దంటూ ప్రభుత్వం ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అధికారంలో ఉన్నందున ప్రభుత్వానికి ఉన్న వెసులుబాట్లతో మరింత తీవ్రంగా ప్రయత్నించినా హైకోర్టు అడ్డుపడటంతో రాజధానుల ప్రక్రియ నిలిచిపోయింది. కొత్త ఏడాదిలో అయినా తమ పోరాటం ఫలించి అమరావతే రాజధానిగా ఉంటుందని రైతులు, మూడు రాజధానుల ఏర్పాటు జరిగి తీరుతుందని ప్రభుత్వం.. ఇలా ఇద్దరూ ఆశాభావంగా కనిపిస్తున్నారు. అయితే హైకోర్టులో రాజధాని కేసుల తీర్పు వచ్చినా తిరిగి సుప్రీంకోర్టుకు ఈ కేసులు చేరడం ఖాయం. అప్పుడు కూడా ఆలస్యం తప్పకపోవచ్చు.