year ender 2020 : ఈ ఏడాది జగన్ పులిస్వారీ- అయితే సంచలనం లేదంటే వివాదం
ఏపీలో గతేడాది భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికీ, సీఎం వైఎస్ జగన్కూ ఈ ఏడాది కీలకంగా మారింది. ముఖ్యంగా జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం అమలు కోసం ఈ ఏడాదిలో తీవ్రంగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అయితే ఈ నిర్ణయంతో జగన్ దేశవ్యాప్తంగా అందరి దృష్టీ ఆకర్షించారు. ఇదే కోవలో హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఆయన సుప్రీం ఛీఫ్ జస్టిస్కు రాసిన లేఖ, రాజ్యాంగ సంస్ధలతో ఆయన ప్రభుత్వం సాగిస్తున్న పోరాటం.. ఇలా ఎటు చూసినా సంచలనాలు, వివాదాలతోనే జగన్కు ఈ ఏడాది సాగిపోయిందని చెప్పవచ్చు.
మూడు రాజధానులకు విశ్వప్రయత్నం
ఏపీలో అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకరించిన గత ప్రభుత్వాల తప్పిదాలను సవరించే పెరుతే జగన్ సర్కారు ఈ ఏడాది మూడు రాజధానుల ఏర్పాటు కోసం అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీంతో పాటు సీఆర్డీయే చట్టం రద్దు బిల్లు కూడా ఆమోదించారు. మూడు రాజధానుల కోసం ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రయత్నాలను గతంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించిన టీడీపీ నేతలకు నచ్చలేదు. దీంతో వారు రాజధాని రైతులతో కలిసి ఉద్యమాలు మొదలుపెట్టారు. అయితే అసెంబ్లీలో ఈ రెండు బిల్లుల్ని ఆమోదింపజేసుకున్న ప్రభుత్వానికి శాసనమండలిలో మాత్రం చుక్కెదురైంది. మండలి ఛైర్మన్ బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపడం ద్వారా ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చారు. ఇలా మూడు రాజధానుల ప్రయత్నం చేయడం ద్వారా జగన్ సంచలనం రేపితే, దాన్ని సగంలోనే అడ్డుకున్న టీడీపీ సర్కారుకు షాకిచ్చామని సంబరపడేలోపే జగన్ మండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.
అది తేలే లోపే జూన్లో మరోసారి అసెంబ్లీలో రాజధాని బిల్లులు ఆమోదించి గవర్నర్ ఆమోదం కూడా తీసుకున్నారు.
స్ధానిక పోరు వాయిదాతో నిమ్మగడ్డ టార్గెట్
కరోనా కారణంగా స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ ని్మ్మగడ్డ రమేష్ను టార్గెట్ చేయడం ద్వారా జగన్ మరో సంచలనానికి తెరలేపారు. ఎన్నికలు వాయిదా పడినట్లు ప్రకటన రాగానే ప్రెస్మీట్ పెట్టి మరీ నిమ్మగడ్డను కులం పేరుతో కడిగేశారు. ఓ ముఖ్యమంత్రి స్ధాయిలో ఉన్న వ్యక్తి కులాల పేరుతో బహిరంగ విమర్శలకు దిగడమేంటనే భావన సర్వత్రా వ్యక్తమైంది. అయినా లెక్కచేయలేదు. అనంతరం కుదరదని తెలిసినా ఓ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి నిమ్మగడ్డను పదవీచ్యుతుడిని చేశారు. ఆయన స్ధానంలో తమిళనాడు నుంచి జస్టిస్ కనగరాజ్ను తెచ్చారు. అయితే ఈ ప్రయత్నం బెడిసికొట్టి నిమ్మగడ్డ న్యాయపోరాటంతోతిరిగి పదవి చేపట్టారు. వచ్చీ రాగానే స్ధానిక సంస్ధల ఎన్నికల కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. దాన్ని అడ్డుకునేందుకు సర్కారు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో కోర్టుల నుంచి కూడా ప్రభుత్వానికి సహకారం అందడం లేదు.
కరోనా చర్యల్లో టాప్-విమర్శలకు చెక్
కరోనా ప్రభావాన్ని ముందు అందరి కంటే తక్కువ అంచనా వేసి ఆ తర్వాత అందరి కంటే మెరుగ్గా పని చేసిన రాష్ట్రాల్లో ఏపీ ఆగ్రస్ధానంలో నిలిచింది. స్ధానిక సంస్ధల ఎన్నికల వాయిదా సమయంలో కరోనా లేదంటే లేదని చెప్పిన ప్రభుత్వం.. ఆ తర్వాత దాదాపు కోటికి పైగా పరీక్షలు నిర్వహించి కరోనా చర్యల్లో మెరుగైన స్ధానంలో నిలిచింది. ప్రభుత్వం చేపట్టిన సాహసోపేత చర్యలతో వైసీపీ ప్రభుత్వం ఓ దశలో రోజుకు పది వేలకు మించి నమోదైన కేసులను ఇప్పుడు మూడంకెలకు తీసుకొచ్చేసింది. అంతే కాదు దేశంలోనే అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగానూ పేరు తెచ్చుకుంది. ర్యాపిడ్ కిట్ల వినియోగంలోనూ ఏపీ ఆగ్రభాగాన నిలిచింది. పొరుగున ఉన్న తెలంగాణ కరోనా పరీక్షలు నిర్వహించకుండా వైరస్ వ్యాప్తిని తక్కువ చేసి చూపగా ఏపీ మాత్రం ఆ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలిచింది.
Recommended Video
సీజేకు లేఖతో జడ్డీలపై సమరశంఖం
ఈ ఏడాది జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పలు ప్రతికూల తీర్పులు వచ్చాయి. వీటి వెనుక సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారని ముందునుంచీ అనుమానించిన జగన్ సర్కారు
అనూహ్యంగా ఈ వ్యవహారంపై సుప్రీం ఛీఫ్ జస్టిస్కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుతో ఆగకుండా ఆ లేఖను సైతం జనంలోకి పంపింది. దీంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో హైకోర్టు బార్ అసోసియేషన్లు, న్యాయవాద సంఘాలు జగన్ చర్యను ఖండిస్తూ తీర్మానాలు చేశాయి. చివరికి ఈ వ్యవహారం ఇప్పటికీ సుప్రీం ఛీఫ్ జస్టిస్ కోర్టులోనే ఉండగా.. ఏపీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీ కావడం జగన్కు భారీ ఊరటనిచ్చింది. సీజేకు లేఖ వ్యవహారంలో జగన్ పులిమీద స్వారీ చేశారనే విమర్శలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.