ఏచూరీకి విజయన్ షాక్: మూడోసారి రాజ్యసభకు మోకాలడ్డు!
తిరువనంతపురం: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీకి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ షాకిచ్చారు. పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఏచూరిని రాజ్యసభకు ఎన్నుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఏచూరిని మూడోదఫా రాజ్యసభకు పంపించే విషయమై ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన కేంద్ర కమిటీ చర్చిస్తున్న సమయంలోనే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
'కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పార్టీ ప్రధాన కార్యదర్శిని రాజ్యసభకు పంపడం మా రాజకీయ వైఖరికి విరుద్ధం' అని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి పార్లమెంటేరియన్ బాధ్యతలకు న్యాయం చేకూర్చలేరని, పార్టీ బాధ్యతల్లో భాగంగా ఆయన దేశ వ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుందని చెప్పారు.
కాగా, సీపీఎం రాజ్యసభ సభ్యత్వం రెండు గ్రూపుల మధ్య దుమారాన్ని రేపుతోంది. రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికైన పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మూడోసారీ పెద్దలసభలో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు ఆయన ప్రణాళికలు వేశారు. అయితే, పార్టీలో మరో సీనియర్ నేత ప్రకాశ్ కారత్ వర్గం దీనిపై విముఖత వ్యక్తం చేసింది.
ఆగస్టు 8న జరగనున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్కు తుది గడువు జులై 28 సమీపిస్తుండటంతో ఈ సమావేశాల్లోనే ఎవరు పోటీ చేస్తారనే దానిపై కేంద్ర కమిటీ స్పష్టత నివ్వాల్సి ఉంది. కాగా, అంతర్గత విభేదాల నేపథ్యంలో మూడోసారి ఏచూరిని రాజ్యసభకు పంపేందుకు కారత్ వర్గం వ్యతిరేకిస్తోంది.