గణేష్ లడ్డూలకు డిమాండ్: ఎల్లారెడ్డిగూడలో 18 లక్షలు
ప్రతి సంవత్సరం నిమజ్జనం రోజున లడ్డూ వేలం పాటకు క్రేజ్ పెరుగుతోంది. ఈ కోవలోనే బుధవారం హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ జలమండలి కార్యాలయం పక్కనే యంగ్బాయిస్ యూత్ అసోసియేషన్ నెలకొల్పిన వినాయకుడి లడ్డూ రూ.18 లక్షలు పలికింది. జోరువానలో జరిగిన వేలంపాటలో ఈ లడ్డూను సొంతం చేసుకునేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు పోటీపడ్డారు. చివరకు జిపిఆర్ హౌసింగ్ గ్రూప్ అధినేత పున్నారావు కుమారుడు కల్యాణ్ రూ.18,11,001కి ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు.
గత ఏడాది ఇక్కడ లడ్డూ రూ.25 వేలు మాత్రమే పలకడం గమనార్హం. ఈ డబ్బుతో వచ్చే ఏడాది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు సిపిరి రాజు యాదవ్ తెలిపారు. మధురానగర్లోని డిఆర్ఆర్ ఎయిమ్స్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ వినాయకుడి లడ్డూను ఎస్ పాండురంగా రావు బృందం రూ.16 లక్షలకు దక్కించుకుంది. గత సంవత్సరం ఇక్కడ లడ్డూ వేలంలో రూ.1.11లక్షలు పలికింది.
అమీర్పేటలోని వివిఆర్ హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మంటపం వద్ద నిర్వహించిన లడ్డూ వేలం పాటలో సంస్థల సిఈవో బిఎస్ఎన్ మూర్తి రూ.12,01,116కు దక్కించుకున్నారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణేష్ లడ్డూను రూ.9.26 లక్షలకు టికెఆర్ విద్యా సంస్థల తరఫున ఆ సంస్థ అధినేత మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డి దక్కించుకున్నారు. కెపిహెచ్బీ కాలనీలోని సర్దార్ పటేల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేలంలో అఖిలేష్ గౌడ్ రూ.8.12 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
బడంగ్పేటలో వీరాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన వేలంలో పెద్దబావి పార్వతమ్మ తరఫున ఆమె కుమారులు రూ.6.40 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. అంబర్పేటలోని గణేష్ సేవా సమితి వినాయకుడి లడ్డూను తెరాస నాయకుడు సుధాకర్ రెడ్డి రూ.2.01 లక్షలకు సొంతం చేసుకున్నారు. బండ్లగూడలోని డిడి కాలనీలో నిర్వహించిన వేలం పాటలో కాలనీ సంఘం అధ్యక్షుడు హరీశ్వర్ రెడ్డి రూ.1,01,000కు లడ్డూను సొంతం చేసుకున్నారు.