'ఆ ఒక్క ఘటనతో చంద్రబాబు ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగింది..'
ఏర్పేడులో జరితగిన లారీ ప్రమాద ఘటన తెలుగుదేశం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
చిత్తూరు: ఏర్పేడు ప్రమాద ఘటనలో టీడీపీ నాయకులే ప్రధాన కారకులుగా ఉండటం ఆ పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చింది. ఘటన తర్వాత వారిని సస్పెండ్ చేసినా.. బాధిత కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా అని ప్రకటించినా.. ఇవేవి ఆ పార్టీ మీద పడ్డ మచ్చను తొలగించలేదు.
పైగా పరామర్శించడానికి వెళ్లిన సమయంలో మంత్రి లోకేష్, మాజీ మంత్రి బొజ్జలకు చేదు అనుభవాలు తప్పలేదు. ముఖం మీదే నిలదీసిన బాధిత కుటుంబాలు అధికార పార్టీ తీరును తప్పుపట్టాయి. స్థానిక టీడీపీ కార్యకర్తలు సైతం పార్టీ నేతల పాత్రపై బహిరంగంగానే విమర్శలు చేశారు.
తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా ఈ విషయం అంగీకరించారు. ఏర్పేడులో జరితగిన లారీ ప్రమాద ఘటన తెలుగుదేశం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇది బాధాకరమైన విషయమని అన్నారు. బాధ్యులైన టీడీపీ నేతలను సస్పెండ్ చేశామన్నారు.
జాతీయ రహదారులను సక్రమంగా నిర్వహించేందుకు తాము డబ్బులు చెల్లిస్తున్నామని, వాళ్లు తమ పనిని సక్రమంగా నిర్వర్తించడం లేదని మండిపడ్డారు. చెక్ పోస్టుల వద్ద మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని గుర్తించాలన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే లారీల్లో తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండేలా చూసుకోవాలన్నారు. వాహనాలు నడిపేవారు మద్యం సేవించినట్లు గనుక తేలితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.