భారీ కుంభకోణం: తూళ్లూరు భూసేకరణపై యోగేంద్ర
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్, రియల్ ఎస్టేట్ ఏజెంట్గా వ్యవహరిస్తూ రైతుల నుంచి వేలాది ఎకరాలను సేకరించడం దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణమని స్వరాజ్ సంవాద్ వ్యవస్థాపకుడు యోగేంద్ర యాదవ్ అభివర్ణించారు.
రాజధాని అమరావతి ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక, ఉద్దండ్రాయునిపాలెం, వెంకటపాలెం, లింగాయపాలెం, మల్కాపురం, తదితర గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు.
ఆ తర్వాత రాయపూడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బహుళ పంటలు పండే భూములను రాష్ట్ర ప్రభుత్వం భూసమీకరణ పేరుతో లక్ష ఎకరాల వరకు రైతుల నుంచి తీసుకోవడం ఆందోళన కలిగించే విషయమని ఆయన న్నారు.
ప్రజాస్వామ్య చట్టాలను ఉల్లంఘించి రైతుల హక్కులను కాలరాసేలా ప్రభుత్వం భూములను తీసుకుంటోందని విమర్శించారు. పంజాబ్ రాజధాని చండీగఢ్ కోసం ప్రభుత్వం కేవలం 9 వేల ఎకరాలు సేకరించగా, ఇక్కడి ప్రభుత్వం మాత్రం రాజధాని పేరుతో లక్ష ఎకరాలు సేకరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం బహుళ పంటలు పండే భూములను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో రాజధాని నిర్మిస్తే దేశంలో ఆహార సంక్షోభం ఏర్పడదని అన్నారు.
ఇప్పటికీ రాజధాని పరిధిలో సామాజిక, ఆర్థిక సర్వే పూర్తిచేయకుండా ప్రభుత్వం తాత్సారం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. రైతుల ఆస్తిగా ఉన్న భూమిని ప్రభుత్వం బలవంతంగా లాక్కోవటం తగదన్నారు. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల హక్కులను ప్రభుత్వాలు పరిరక్షించాలని యోగేంద్ర యాదవ్ డిమాండ్ చేశారు.