ఈసీ అంటే హైకోర్టు న్యాయమూర్తితో సమానం, స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించడం సరికాదు: రమేశ్ కుమార్
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈసీకి సర్వాధాకారాలు ఉంటాయని ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఈసీ అంటే హైకోర్టు న్యాయమూర్తితో సమానం అని గుర్తుచేశారు. కరోనా వైరస్పై కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే వ్యవహరించానని గుర్తుచేశారు. కానీ తనపై వ్యక్తిగతంగా కామెంట్లు చేయడం సరికాదని సూచించారు. ఈ మేరకు ఆదివారం ఒక నోట్ను రమేశ్ కుమార్ విడుదల చేశారు. ఎన్నికల వాయిదావేయడంపై సీఎం జగన్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను కలిసి విన్నవించారు. దీంతో తనను కలువాలని రమేశ్కు సమాచారం పంపించారు. సోమవారం ఉదయం 11 గంటలకు గవర్నర్తో రమేశ్ కుమార్ సమావేశమయ్యే అవకాశం ఉంది.
కేంద్ర సూచనల మేరకే..
కరోనా వైరస్పై కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఎన్నికలను వాయిదా వేశానని పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నామని, ఇందులో తన సొంత నిర్ణయమేమీ లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీని కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళి మేరకు అడ్డుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితి మెరుగైన మరుక్షణం ఎన్నికలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. తనను వ్యక్తిగతంగా విమర్శించడం అంటే ఎన్నికల సంఘాన్ని బలహీనపరచడమేనని పేర్కొన్నారు.
వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు..
ఎన్నికల సంఘం విధులు, గతంలో ప్రవర్తించిన తీరును కూడా తన లేఖలో రమేశ్ కుమార్ పేర్కొన్నారు. కిషన్ సింగ్ తోమర్ వర్సెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ అహ్మదాబాద్ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పును అనుసరించి వ్యవహరించానని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి.. హైకోర్టు న్యాయమూర్తితో సమానమని... స్వయం ప్రతిపత్తి గల సంస్థ అధికారిపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదని పేర్కొన్నారు.
ఇదీ నేపథ్యం..
కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ వాయిదావేయడంతో వివాదం రాజుకుంది. వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఖండించారు. అధికార పార్టీ నేతలు రమేశ్ కుమార్.. చంద్రబాబు చెప్పినట్టు నడుచుకొంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. వైరస్ ప్రబలుతుంటే ఎన్నికలు ముఖ్యమా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు.. అధికార వైసీపీ నేతల తీరును తప్పుపట్టారు. ఈ క్రమంలో రమేశ్ కుమార్ వివరణ ఇచ్చారు.