మీ వల్లే ఎన్నికల్లో ఓడిపోయాను: కార్యకర్తలపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం, జగన్ సర్కారుకు చురకలు
తూర్పుగోదావరి: నేతలు ఓట్లు కొనేందుకు డబ్బు ఖర్చు పెడుతున్నారు కానీ.. రైతును ఆదుకోవడానికి మాత్రం ముందుకు రావడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సులో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు.
పరిస్థితులు ఎలా చేయిదాటతాయో చెప్పలేను
రాష్ట్రంలో కులాలకు అతీతంగా రైతు పథకాలు అమలు చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకుంటే డిసెంబర్ 12న కాకినాడలో దీక్ష చేస్తానని చెప్పారు. ఆ తర్వాత పరిస్థితులు ఎలా చేయిదాటతాయో చెప్పలేనని పవన్ కళ్యాణ్ అన్నారు. రైతు కష్టం నుంచి మరింత కష్టాల్లోకి వెళ్తున్నాడని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతును ఆదుకోవడానికి ప్రభుత్వాలు ముందుకు రావడం లేదని అన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు రసీదులు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిట్లు మాని మంచి పనులు చేయాలని హితవు పలికారు.
మీ వల్లే ఓడిపోయానంటూ..
కాగా, పవన్ కళ్యాణ్ రావడంతో సభకు భారీగా జనసేన కార్యకర్తలు హాజరయ్యారు. అరుపులు, కేకలతో కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించడంపై పవన్ కళ్యాణ్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. జనసైనికులకు క్రమశిక్షణ కొరవడటం వల్లే ఓడిపోయానని ఆయన అన్నారు.
లేదంటే జనసేన గెలిచివుండేది..
అన్నం పెట్టే రైతు కష్టాలు చెబుతున్నప్పుడు మీరు అరుస్తుంటే.. తనకు ఎలా వినిపిస్తుంది? నిజంగా ఇబ్బందిగా ఉందని కార్యకర్తలనుద్దేశించి పవన్ కళ్యాన్ వ్యాఖ్యానించారు. అంతేగాక, ‘క్రమశిక్షణ లేకపోతే మీరేం చేయలేరు.. మీరు సరిగా లేకపోవడం వల్లే నేను ఓడిపోవాల్సి వచ్చింది. అది మర్చిపోకండి.. క్రమశిక్షణ ఉండుంటే.. జనసేన గెలిచివుండేది' అని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు వెన్నెముక అంటూనే విరిచేస్తారు
‘ప్రతి సంవత్సరం అప్పు చేసి రైతులు ఈ ఏడాది అయినా ఆదాయం వస్తుందన్న ఆశతో ఏటికేడాది పంటలు పండిస్తూనే ఉన్నారు. ఏ రోజూ లాభసాటి ధర చూసింది లేదు. ఇప్పటికీ గిట్టుబాటు ధర కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ రైతుకు కావాల్సింది లాభసాటి ధర. రైతు కష్టాన్ని గుర్తించాలి. గిట్టుబాటు కాదు లాభసాటి ధర కోసం ప్రయత్నాలు చేయాలి. గతంలో తూర్పుగోదావరి జిల్లా రైతులు ఈ పంటలు మేము పండించలేము అంటూ క్రాప్ హాలిడే ప్రకటిస్తే కేంద్రం నుంచి రాజ్ నాథ్ సింగ్ గారు, అజిత్ సింగ్ గారు వచ్చారు. అన్నదాతల పరిస్థితిని పార్లమెంటులో ప్రస్తావించారు. రైతుల కోసం నాడు మోహన్ కందా గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కమిటీ ఓ నివేదిక సిద్ధం చేసి అందచేశారు. అందులో కీలకమైన అంశాలు ఈ రోజుకు అమలుకు నోచుకోలేదు. మాట్లాడితే రైతే వెన్నెముక అంటారు. ఆ రైతు వెన్నెముకనే విరిచేస్తున్నారు. జగన్ రెడ్డి గారిని అడుగుతున్నా రైతులకు అండగా నిలబడడం మీ బాధ్యత కాదా?' అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
వైఎస్ జగన్ 30ఏళ్లు ఉంటే.. ఏ రైతు బతకడు..
‘151 మంది ఎమ్మెల్యేలను పెట్టుకుని.. జనసేన పార్టీ వస్తుంది అని తెలియగానే రాత్రికి రాత్రి రూ. 87 కోట్లు విడుదల చేశారు. జనసేన వస్తేగానీ మీకు రైతుల కష్టాలు తెలియవా? మరి 151 మంది ఉండి ఏం లాభం? వ్యవసాయం పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్ధం అవుతోంది. మీకు బాధ్యత లేదా? జగన్ రెడ్డి గారిని అడుగుతున్నా రైతులకు మీరు ఇప్పుడు అండగా లేకపోతే ఇంకా ఎప్పుడు అండగా ఉంటారు? పంట పండించడం అంటే మామూలు విషయం కాదు ప్రతి మొక్కను బిడ్డతో సమంగా సాకాలి. గత ఏడాది ఐదుసార్లు మందులు పిచికారీ చేస్తే, భారీ వర్షాల కారణంగా ఈసారి ఏడుసార్లు చేయాల్సి వచ్చింది. ఇలా ఒక్క సమస్య కాదు రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. రైతుల కష్టాలు పట్టించుకోకపోతే 151 మంది ఎమ్మెల్యేలు ఉండి ఏం లాభం. మాటలను వక్రీకరించడం కాదు. రైతుల కష్టాన్ని తెలుసుకోండి. మీరు 30 ఏళ్లు పాలిస్తే ప్రతి రైతు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి వస్తుంది' అని వైఎస్ జగన్ సర్కారుకు పవన్ కళ్యాణ్ చురకలంటించారు.