'బాహుబలి-2' సీడీ కావాలా నాయనా? కేవలం రూ. 30 మాత్రమే!
సంచలన విజయం సాధించిన'బాహుబలి-2' సినిమా పైరసీ కోరల్లో చిక్కుకుంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఈ సినిమా సీడీలు విచ్చలవిడిగా లభిస్తున్నాయి. ఒక్కో సీడీని కేవలం రూ. 30కే అమ్మేస్తున్నారు.
విజయవాడ: 'కోట్లాది రూపాయలు ఖర్చు చేశాం, ఏళ్ల పాటు కష్టించి సినిమాను నిర్మించాం... దయచేసి ఈ సినిమాను పైరసీ చేయకండి', అంటూ దర్శక నిర్మాతలు, నటీనటులు ఎంతగానో వేడుకున్నా పైరసీ కేటుగాళ్లు పంజా విసురుతూనే ఉన్నారు.
తాజాగా సంచలన విజయం సాధించిన 'బాహుబలి-2' సినిమా కూడా పైరసీ కోరల్లో చిక్కుకుంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఈ సినిమాకు సంబంధించిన సీడీలు విచ్చలవిడిగా లభిస్తున్నాయి.
పలు సీడీ దుకాణాలపై టాస్క్ ఫోర్స్ సిబ్బంది చేసిన దాడుల్లో భారీ సంఖ్యలో ఈ సినిమా పైరసీ సీడీలు బయటపడ్డాయి. ఒక్కో సీడీని కేవలం రూ. 30కే అమ్మేస్తున్నారు ఆయా దుకాణాల నిర్వాహకులు.
ఈ సీడీలన్నీ చెన్నై నుంచి వస్తున్నాయని షాపు యజమానులు తెలిపారు. తాము పైరసీ సీడీలను అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేస్తూనే ఉన్నామని, ప్రజల్లో మార్పు వస్తే తప్ప ఈ పైరసీ భూతం ఆట కట్టించలేమని టాస్క్ ఫోర్స్ అధికారులు అంటున్నారు.