మమ్మల్ని చంపేస్తారా ? టీడీపీ నేతల మీద దాడిపై చంద్రబాబు సీరియస్
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు దాడులు చేసుకునేదాకా వెళ్ళాయి. నేడు మాచర్లకు వెళ్ళిన టీడీపీ నేతలు బోండా ఉమా , బుద్దా వెంకన్నల కారుపై కొందరు దాడులు చేయడంతో , రాడ్లతో కార్ల అద్దాలు పగలగొట్టటంతో మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సీరియస్ అయ్యారు. టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేసే ఉన్మాద చర్యను తాము సహించబోమని చంద్రబాబు చెప్పారు.
లోకల్ వార్ పై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్: వైసీపీ డబ్బు పంచితే ఆ పని చెయ్యండి
ఎన్నికల్లో నామినేషన్లు వెయ్యకుండా దాడులు చెయ్యటం పై చంద్రబాబు ఫైర్
ఇక ఈ ఘటనపై టీడీపీ అధినేత సీరియస్ అయ్యారు. డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. పోలీసు వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు. నామినేషన్లు ఇవ్వకుండా అడ్డుకోవటం, కొట్టటం , నామినేషన్ పత్రాలు చించి వెయ్యటం , దాడులు చెయ్యటం , బెదిరించటం తదితర ఘటనలు జరుగుతున్నా , ఇంత ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల నుండి వెల్దుర్తి, దుర్గి వరకు మోటార్ బైక్ లపై వెళ్లి వెంటాడి మరీ దాడులు చేస్తున్నారని ఇక దీనికి సమాధానం చెప్పాలని అన్నారు చంద్రబాబు.
ఎన్నికల కమీషన్ ఏం చేస్తుందని మండిపడిన బాబు
ఇక ఇంతా జరుగుతున్నా ఎన్నికల కమీషన్ ఏం చేస్తుందని చంద్రబాబు మండిపడ్డారు . ఇలాంటి రాజకీయాలు ఎక్కడైనా ఉన్నాయా అని మండిపడ్డారు. గవర్నర్ దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకువెళ్తామని అన్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన చెందారు . సర్టిఫికెట్లు కూడా తీసుకోనీకుండా అడ్డుకుంటున్నారని , ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు . టీడీపీ నేతలను చంపేస్తారా ? చంపెయ్యండి అంటూ మండిపడ్డారు.
దాడులపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్
తమాషాగా ఉందా అని ప్రశ్నించారు చంద్రబాబు . సీఎం జగన్ సమాధానం ఇవ్వాలని చెప్పారు. ఈ రాష్ట్రానికి పట్టిన శని అని భగ్గుమన్నారు. పులివెందుల రాజకీయాలు ఏపీలో చేస్తున్నారని, కంట్రోల్ చెయ్యాలని పోలీసు వ్యవస్థ ఎందుకని ప్రశ్నించారు చంద్రబాబు . కాశ్మీర్ లో కూడా జరగని ఘటనలు ఇక్కడ జరుగుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఏంటీ దరిద్రం, ఏంటీ దారుణం అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా ? మాజీ ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ లను చంపేస్తారా ? టీడీపీ నేతలను చంపెయ్యండి అని ఉద్వేగంగా మాట్లాడారు.
రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తున్నారని ఆగ్రహం
ప్రజాస్వామ్యాన్ని బలి చేస్తున్నారని, రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తున్నారని మండిపడ్డారు . ఎక్కడ చూసినా టీడీపీ నేతలు పోటీ చెయ్యకుండా అడ్డుకోవటం ప్రజా స్వామ్యమా అని ప్రశ్నించారు. ప్రజలు సైతం ఆలోచించాలని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలు వద్దంటే ఎన్నికల్లో కూడా పోటీ చెయ్యమని చంద్రబాబు అన్నారు. తన జీవితంలో ఇలాంటి ఘటనలు ఎక్కడా చూడలేదన్నారు చంద్రబాబు. ప్రజలే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేసి తీరతామని చెప్పారు.