అమెరికాపై ఆశలు పెట్టుకోవద్దు: ప్రపంచం నివ్వెరపోతోందన్న బొండా ఉమ
అమెరికా జాత్యహంకార దాడులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితిలో అమెరికాపై ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దని తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. అంతేగాక, పరిస్థితులు చక్కబడే వరకూ కొన్నేళ్లపాటు అమెర
విజయవాడ: అమెరికా జాత్యహంకార దాడులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితిలో అమెరికాపై ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దని తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. అంతేగాక, పరిస్థితులు చక్కబడే వరకూ కొన్నేళ్లపాటు అమెరికా ప్రయాణం చేయవద్దని సూచించారు.
అమెరికాలో హత్యకు గురైన కూచిభొట్ల శ్రీనివాస్ ఉదంతాన్ని ఖండిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చర్యలకు నిరసనగా మధురానగర్లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ మాట్లాడుతూ.. అమెరికాలో జరుగుతున్న హత్యలను చూసి ప్రపంచం మొత్తం నివ్వెరపోతోందని అన్నారు.
అమెరికాలో విద్యా, ఉద్యోగం కన్నా ప్రాణాలే మిన్న కాబట్టి వాస్తవ పరిస్థితిలు నెలకొనే వరకూ అమెరికా వైపు చూడవద్దని హితవు పలికారు. అలాగే అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న చర్యలు కూడా శోచనీయమని, ప్రపంచం మొత్తం నిరసిస్తున్నా ఆయన చర్యలు మానుకోకపోవడం గర్హనీయమన్నారు.
కోట్లాది మంది ప్రవాస భారతీయుల సమస్యను పరిష్కరించడంలో భారత ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. అమెరికన్ చేతిలో హత్యకు గురైన కూచిభొట్ల శ్రీనివాస్కు ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ఉమ.. ట్రంప్ చర్యలను తీవ్రంగా నిరసించారు.
ట్రంప్ పై మండిపడిన బ్రాహ్మణ సమాజం
అమెరికాలో జాత్యాహంకారంతో అన్యాయంగా కూచిబొట్ల శ్రీనివాస్ను హత్య చేశారని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య, విజయవాడ బ్రాహ్మణ సేవా సంఘం, ఇతర సంఘాల నేతలు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. కూచిబొట్ల శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అమెరికాలో ఉన్న వలసదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న అధ్యక్షుడు ట్రంప్ విధానాలను మార్చుకోవాలన్నారు. అమెరికాలోని వలసదారులకు రక్షణ కల్పించాలని బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు కొప్పరపు వెంకట బలరామకృష్ణమూర్తి కోరారు. ఈవిషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి అమెరికా అధ్యక్షుడితో సంప్రదింపులు జరిపి అక్కడి భారతీయులకు అండగా నిలవాలన్నారు.