ఇజ్రాయేల్ టెక్నాలజీతో...ఆంధ్రా అన్నదాతకు అండగా నిలుస్తున్నయువ పారిశ్రామికవేత్త
తూర్పుగోదావరి:ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము తోడ్పాటుతో పంటల సాగులో అద్భుతాలు సృష్టిస్తున్నఇజ్రాయిల్ టెక్నాలజీని ఆంధ్రా రైతులకు అందుబాటులోకి తెచ్చాడో ఔత్సాహిక పారిశ్రామికవేత్త. కేవలం పెట్టుబడి పెట్టడమే కాదు తాను కూడా వ్యవసాయ పరిశోధనలు చేస్తూ తన సొంత గడ్డ మీద వాటిని అమలు చేసి సత్పలితాలు సాధిస్తున్నాడు.
రైతులకు తమ పంట గురించిన సమస్త సమాచారం ముందే తెలిసే ఆ అధ్బుతమైన ఇజ్రాయిల్ టెక్నాలజీ గురించి...ఈ యువ పారిశ్రామికవేత్త మరియు శాస్త్రవేత్త పరిశోధనల గురించి తెలుసుకున్న కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి పర్షోత్తమ్ రుపాలా ఇటీవల ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించారు. రైతులకు ఈ టెక్నాలజీ వల్ల జరిగే మేలేంటో సవివరంగా అడిగి తెలుసుకున్నారు...తన అద్భుత ప్రయోగాలతో చిన్నవయస్సులోనే అన్నదాతకు అండగా నిలుస్తున్నఈ యువకుడు వివరాలివి.
యువ సైంటిస్ట్....వివరాలు
ఇతడి పేరు సుంకవల్లి సూర్య. స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా. సుంకవల్లి ఫార్మాటెక్ ఫౌండేషన్ అనే పేరుతో వ్యవసాయ అనుబంధ సంస్థను స్థాపించి రైతులకు ఉచితంగా చేయూత అందిస్తున్నాడు. రైతు పంట సాగు మొదలుపెట్టేందుకు సన్నద్దమయ్యే తరుణంలోనే వర్షం ఎన్నిరోజుల్లో కురుస్తుంది... ఎరువు, క్రిమి సంహారకాలు పొలంలో ఎక్కడెక్కడ ఎంత వేయాలి...దిగుబడి ఎన్ని రోజుల్లో వస్తుంది...ఎంత వస్తుంది...తదితర వివరాలన్నీముందుగానే రైతుకు తెలిస్తే...ఆ రైతుకు ఒనగూడే మేలు అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఇజ్రాయిల్ వ్యవసాయ విధానంలో అమలు చేస్తున్న అత్యాధునిక పద్ధతి ఇది. ఈ విధానాన్ని డిసీజ్ పెస్ట్ ఇన్సెక్ట్స్ డిటెక్టర్(డీపీఐడీ)గా పిలుస్తారు.
వ్యవసాయమంత్రిచే...ఢిల్లీకి పిలుపు
ఈ విధానంపై పరిశోధనలు చేస్తూ దాన్ని దేశీయంగా అమలు చేస్తున్నసుంకరవల్లి సూర్యను కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి పర్షోత్తమ్ రుపాలా ఢిల్లీకి పిలిపించుకుని ఉపగ్రహ ఆధారిత సాగు గురించి వివరాలు అడిగారు. అలాగే రెండు సమస్యలను ఆయన ప్రస్తావించారు. ప్రకృతి విపత్తుల సమయంలో పంట నష్ట సమాచారం రైతులకు అందించాలంటే ఆ సమయంలో దిగుబడి ఎంత ఉందో అంచనా వేయవచ్చా...దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఏఏ పంటలను ఎంత మేర పండిస్తున్నారో తెలుసుకోవచ్చా...అని సూర్యను అడుగగా కచ్చితంగా గణాంకాలతో సహా తెలుసుకోవచ్చంటూ వివరించిన సూర్య డిపిఐడీ పనిచేసే విధానం కూడా కేంద్ర మంత్రికి వివరించారు.
డిపిఐడీ సిస్టమ్...పనితీరు
ఈ డిపిఐడీ సిస్టమ్ పూర్తిగా రెండు ఉపగ్రహాల సహాయంతో పనిచేస్తుందని, ముందుగా ఏ ప్రాంతంలో అయితే ఈ విధానం అమలు చేయనున్నారో దానికి సంబంధించి రైతుల పేర్లు, సర్వే నంబర్లను ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా కంప్యూటర్ లో నిక్షిప్తం చేయడం జరుగుతుందని చెప్పారు. అనంతరం ఇంటర్నెట్ సాయంతో ఈ సమాచారాన్ని ఉపగ్రహాలకు అనుసంధానం చేస్తారు. దీంతో ఆ ఉపగ్రహం ఆ ప్రాంతాన్ని గుర్తిస్తుంది. సంబంధిత రైతుకు సంబంధించిన వివరాలతో సహా పంట పొలం ఫోటోతో సహా సిస్టమ్ తో పాటు రైతు సెల్ ఫోన్ కు సమాచారం వస్తుంది. దాంతో పాటు పొలంలోని ప్రతి మడికి సంబంధించిన పూర్తి వివరాలను అందించడంతోపాటు పంటకు ఆశించబోయే, ఆశించిన చీడపీడలు తదితర వివరాలను అందిస్తుంది.
రైతులకు...ఎంతో మేలు
రైతు తన పొలంలో వదిలిన నీరు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉందో, ఎక్కడ తక్కువగా ఉందో సమాచారం తెలుసుకోవచ్చు. ఇదంతా రైతు పొలంలో తిరుగుతూ పరిశీలించాల్సిన అవసరం లేదు. తన చరవాణికే సంక్షిప్త సమాచారం వస్తుంది. దీనివల్ల రైతుకు ఒనగూడే మేలు మాటల్లో వర్ణించి చెప్పలేమని యువ శాస్త్రవేత్త సూర్య అంటున్నారు. తాను సుంకవల్లి ఫార్మాటెక్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి దేశంలో తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లాలోని తొర్రేడు, కాతేరు, వెంకటనగరం, కొంతమూరు, కోలమూరు, రాయుడుపాకలు, మురమండ, శ్రీరంగపట్నం గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఏడు వేల ఎకరాల్లో ఆ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.