ట్రీట్మెంట్ కోసం వస్తారు.. అందాల వల విసురుతారు, చిక్కుకున్నారో ఇంతేసంగతులు!
Recommended Video
గుంటూరు: గుంటూరు విజయవాడలలో ఓ కొత్తరకం దందా నడుస్తోంది. అక్కడి యువ డాక్టర్లపై ఒక ముఠా అందాల వల విసురుతోంది. ముందుగానే తమ 'టార్గెట్'ను ఎంచుకుని ట్రీట్మెంట్ పేరిట పరిచయం పెంచుకుని ఆపైన ముంచేస్తున్నారు.
తమ వలలో పడిన యువ వైద్యులను విందు, వినోదం పేరుతో ఇంటికి పిలిచి ట్రాప్ చేస్తారు. సన్నిహితంగా మెలుగుతూ.. ఆ దృశ్యాలను ముందుగానే అమర్చిన కెమెరాల్లో చిత్రీకరించి, ఆ తరువాత వాటిని చూపించి రూ.లక్షలు గుంజుతారు.
యువ డాక్టర్లపై అందాల వల...
డాక్టర్లను తమ వలలో వేసుకునేందుకు ఈ ముఠా అందమైన, ఆకర్షణీమైన అమ్మాయిలను ఎంచుకుంటోంది. వీరు తొలుత పేషెంట్ గా వచ్చి తమ అందాన్ని ఎరగా వేస్తున్నారు. మాటల చాతుర్యంతో యువడాక్టర్లను ఇట్టే పడవేస్తున్నారు. అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి అని కల్లిబొల్లి కబుర్లు చెప్పి తమ అందాలను డాక్టర్ల ఎదుట ప్రదర్శించి వారిని కవ్విస్తున్నారు.
తరచూ కలిసి పరిచయం పెంచుకుని...
తరచూ డాక్టర్ల వద్దకు వస్తూ ఈ యువతులు వారితో పరిచయం పెంచుకుంటున్నారు. తమ రోగాలకు సంబంధం లేని కబుర్లు చెబుతూ, వారి వద్ద కన్నీళ్లు పెట్టుకుంటూ జాలి కలిగేలా ప్రవర్తించి ఇట్టే బుట్టలో వేసుకుంటున్నారు. తనకు పెళ్లయిందని, తన భర్త దూరంగా ఉంటూ నెలకోసారో, అర్నెల్లకోసారో వచ్చిపోతుంటాడంటూ ఆమె ఒంటరిగా ఉంటోందనే విషయాన్ని డాక్టర్ల బుర్రకు ఎక్కేలా చేస్తారు.
ఫొటోలు, వీడియోలు తీసి...
ఆ తరువాత అసలు కథ మొదలవుతుంది. బాగా పరిచయం పెంచుకున్న తరువాత, తమ ఆకర్షణలో పడ్డాడని తెలిసిన తరువాత.. బర్త్ డే పేరుతోనో, మరేదైనా సందర్భం సృష్టించో వారిని తమ ఇంటికి ఆహ్వానిస్తారు. ఇంటికి రాగానే మరింత సన్నిహితంగా మెలుగుతూ, అవసరమైతే శృంగారం నెరపి మరీ బుక్ చేస్తున్నారు. వారి రాసలీలలను ఫొటోలు, వీడియోలు తీసి ఆ తరువాత బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నారు.
ఇప్పటి వరకు 11 మంది బాధితులు...
యువ డాక్టర్లపై అందాల వల విసురుతున్న ఈ ముఠా గుంటూరు, విజయవాడ, ఒంగోలు పట్టాణాలకు విస్తరించినట్లు తెలుస్తోంది. గుంటూరులో నలుగురు డాక్టర్లు, విజయవాడలో ఐదుగురు, ఒంగోలులో ఇద్దరు.. ఈ అందాల వలలో పడినట్లు సమాచారం. ఈ ముఠా చేతుల్లో మోసపోయి లక్షల రూపాయలు పోగొట్టుకుని కూడా వీరు తమ బాధను బయటికి చెప్పుకోలేకపోతున్నారు. సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న తాము ఇలా వలలో పడినట్లు తెలిస్తే... పరువు పోతుందనే భయంతో మౌనంగా ఉంటున్నారు.
కక్కలేక మింగలేక అన్నట్లు...
గుంటూరులో ఓ యువ డయాబెటాలజిస్ట్ పరిస్థితి కక్కలేక మింగలేక అన్న చందంగా మారింది. ఈ ముఠా బారిన పడి ఇప్పటికే భారీగా డబ్బు పోగొట్టుకున్న ఆయన్ని సదరు ముఠా మరింత వేధిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ డయాబెటాలజిస్ట్ తన గోడును స్నేహితుడైన మరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్తో వెళ్లబోసుకున్నాడు. దీంతో ఆయన మరింత కూపి లాగారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం పంపి, డాక్టర్ల పేర్లు వెల్లడించాల్సిన అవసరం లేదని, ఎవరైనా డాక్టర్లు ఇలా బ్లాక్ మెయిలింగ్కు గురైతే సమాచారం అందించాలంటూ ఆయన కోరారు.