మానవబాంబుగా మారి సీఎంను చంపుతానన్న యువకుడు అరెస్ట్.. స్పందించిన జనసేన
మానవ బాంబుగా మారి ముఖ్యమంత్రిని చంపుతానని కన్నాభాయ్ అకౌంట్ పేరుతో ట్విట్టర్లో పోస్ట్ పెట్టిన వ్యక్తిని సిఐడి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మానవ బాంబుగా మారి ముఖ్యమంత్రిని చంపుతానని రాజమహేంద్రవరానికి చెందిన రాజుపాలెం పవన్ ఫణి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈనెల 16వ తేదీన ట్విటర్లో పోస్టు పెట్టిన పవన్ ఫణి ఆ తర్వాత వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు. ఆపై అకౌంట్ ను కూడా క్లోజ్ చేశారు. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు.
సీఎంను చంపుతానని పోస్ట్ పెట్టిన వ్యక్తి అరెస్ట్
అయినప్పటికీ పవన్ ఫణి పెట్టిన పోస్టుపై దృష్టిసారించిన సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పవన్ ఫణిని అరెస్ట్ చేశారు. నిందితుడు జనసేన మద్దతు దారుడిని సైబర్ క్రైమ్ ఎస్పి రాధిక మీడియాకు వెల్లడించారు. తాను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అని పవన్ ఫణి చెప్పినట్టు తెలుస్తుంది. ఇటువంటి పోస్టులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సైబర్ క్రైమ్ ఎస్పీ తెలిపారు.
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితుడి అరెస్ట్
నిందితుడు పవన్ ఫణి హైదరాబాద్ లోని ఓ సంస్థలో సేల్స్ సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు అని పేర్కొన్నారు. సిఐడి సైబర్ నేరాల విభాగం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితుడి ఆచూకీ కనిపెట్టామని చెప్పారు. ముఖ్యమంత్రిని హత్య చేస్తే ప్రభుత్వం కూలిపోతుందని విద్వేషపూరిత పోస్టులు పెట్టినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని సైబర్ క్రైమ్ ఎస్పీ వెల్లడించారు. అభ్యంతరకర పోస్ట్ లు, అశ్లీల పోస్టులు, ఇతరుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు ఎవరు పెట్టినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
జనసేన పార్టీకి పవన్ ఫణికి సంబంధం లేదన్న జనసేన
ఫేక్ ఖాతాల ద్వారా పోస్టులు పెట్టి, ఆ తర్వాత డిలీట్ చేసి తాము దొరకము అనుకుంటే పొరపాటు అని సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక పేర్కొన్నారు. ఇటువంటి వారిని రాజకీయ పార్టీల నాయకులు దూరంగా ఉంచాలని పేర్కొన్నారు. సిఐడి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన పవన్ ఫణి జనసేన మద్దతుదారుడు కావడంతో ఈ వ్యవహారంపై జనసేన పార్టీ స్పందించింది. ముఖ్యమంత్రిని చంపుతానని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ పెట్టిన వ్యక్తి తో జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. హింస, అశాంతి రేకెత్తించే వ్యాఖ్యలను తమ పార్టీ ఖండిస్తుందని వెల్లడించింది.
Recommended Video
సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారా? జాగ్రత్త
ఏది ఏమైనా సోషల్ మీడియాను విపరీతంగా వాడుతున్న చాలామంది పెడుతున్న పోస్టులు అభ్యంతరకరంగా ఉంటున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హెచ్చరికలు జారీ చేస్తూ మానవ బాంబుగా మారి సీఎంను చంపుతానని పోస్ట్ పెట్టిన వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకు ముందు కూడా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై సిఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. పలువురికి వార్నింగ్ ఇచ్చారు. ఇక తాజాగా మరో మారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.