కత్తితో విచక్షణారహితంగా ప్రేమోన్మాది దాడి; యువతి మృతి .. చిత్తూరు జిల్లాలో దారుణం
దేశంలో మహిళల, బాలికల రక్షణకు ఎన్ని చట్టాలు వచ్చినా ప్రేమోన్మాదులు మాత్రం మారడం లేదు. నిత్యం ఏదో ఒక చోట రెచ్చిపోతూనే ఉన్నారు. యువతులపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రేమను తిరస్కరించారని ఉన్మాదులు యువతులపై పాశవికంగా దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. నడిరోడ్డుపై కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి ని ఆసుపత్రికి తరలిస్తుండగా క్రమంలో మార్గం మధ్యలోనే యువతి మృతి చెందింది.
Recommended Video
పనిస్తామని తీసుకెళ్ళి .. 13 నెలలు బందీగా గ్యాంగ్ రేప్ .. నరకం చూసిన నేపాలీ బాలిక
ఢిల్లీ బాబు అనే యువకుడ్ని రహస్యంగా పెళ్లి చేసుకున్న గాయత్రి
ఈ కేసు వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం తూర్పు పల్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ళ గాయత్రి అనే యువతి, డిగ్రీ చదువుకునే రోజుల్లో పూతలపట్టు మండలం చింతమాకుల పల్లి గ్రామానికి చెందిన ఢిల్లీ బాబు అనే వ్యక్తిని ప్రేమించింది. ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడిన క్రమంలో గత నెల రెండవ వారంలో ఇంట్లో వాళ్లకు చెప్పకుండా తిరుపతిలో వివాహం చేసుకున్నారు. గాయత్రి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
పోలీసుల కౌన్సిలింగ్ తో తల్లిదండ్రుల వద్దే ఉంటానన్న గాయత్రి
ఈ క్రమంలో గాయత్రి తల్లిదండ్రుల వద్దే ఉంటా అని, ఢిల్లీ బాబుతో వెళ్లనని చెప్పడంతో గాయత్రిని ఆమె తల్లిదండ్రులతో పంపించారు. గాయత్రి ఢిల్లీ బాబుని దూరం పెట్టడం ఢిల్లీ బాబు కు ఏమాత్రం నచ్చలేదు. తనను ప్రేమించి , పెళ్ళాడి , ఆపై కాదన్న గాయత్రి పై ద్వేషం పెంచుకున్న ఢిల్లీ బాబు గాయత్రిని ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈరోజు తన బంధువుల అమ్మాయితో కలిసి టూ వీలర్ పై గాయత్రి ఇంటికి వెళుతున్న క్రమంలో గాయత్రి ఎంపరాళ్ళ కొత్తూరు వద్ద అడ్డుకున్నాడు.
కక్ష పెంచుకుని గాయత్రిని కత్తితో దాడి చేసిన ఢిల్లీ బాబు .. గాయత్రి మృతి
తీవ్ర ఆగ్రహంతో ఆమె పై కత్తులతో దాడి చేసి గాయపరిచాడు. ఆపై అక్కడి నుండి పరారయ్యాడు ఢిల్లీ బాబు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న గాయపడిన గాయత్రిని బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి సీరియస్ గా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తమిళనాడులోని వేలూరు సిఎంసి కి తరలిస్తుండగా మార్గమధ్యలోనే గాయత్రి ప్రాణాలు కోల్పోయింది. గాయత్రి మృతితో ఆమె కుటుంబం బోరున విలపించింది .
కేసు నమోదు చేసిన పోలీసులు ... ఢిల్లీ బాబు ఇంటిపై గాయత్రి బంధువుల దాడి
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రేమోన్మాది ఢిల్లీ బాబు పరారీలో ఉన్నాడు. యువతి మృతి నేపథ్యంలో గాయత్రి బంధువులు చింతమాకుల పల్లి గ్రామంలో ఢిల్లీ బాబు ఇంటిపై దాడి చేశారు. పోలీసులు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గాయత్రి కుటుంబాన్ని అడ్డుకున్నారు. ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయిన గాయత్రికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన సాగించారు.