కడప కుర్రాడు..తన పేరు మీద ఉన్న పార్సెల్ చూసి స్పృహ తప్పాడు!
కడప: జిల్లాలో నకిలీ ఫోన్ కాల్స్ బెడద నానాటికీ తీవ్రతరమౌతోంది. జిల్లాలోని మారుమూల గ్రామాలకు చెందిన యువకులను టార్గెట్ గా చేసుకుని వల పన్నుతున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. స్మార్ట్ ఫోన్లు, లక్కీ డ్రాల పేరుతో వల విసురుతున్నారు. వారి జేబులను ఖాళీ చేస్తున్నారు. ఈ నకిలీ ఫోన్ కాల్స్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఫేక్ ఫోన్ కాల్స్ కు దూరంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నప్పటికీ.. ఫలితం రావట్లేదు. వేల రూపాయల విలువ చేసే వస్తువులు చౌక ధరకే లభిస్తున్నాయని సంబరపడుతున్నారే తప్ప.. దాని వెనుక ఉన్న అసలు కుట్రను గ్రహించట్లేదు.
తాజాగా- ఇలాంటి ఉదంతమే మరొకటి కడప జిల్లాలో చోటు చేసుకుంది. బాధితుడి పేరు షేక్ మౌలా. జిల్లాలోని చక్రాయపేట మండలం వీరనారాయణ పల్లికి చెందిన యువకుడు. స్థానికంగా టైలర్ గా పనిచేస్తున్నాడు. రెండురోజుల కిందట అతని సెల్ ఫోన్ కు ఓ ఫేక్ కాల్ వచ్చింది. మీ ఫోన్ నెంబర్కు లక్కిడ్రా తగిలిందని, 17 వేల రూపాయల విలువచేసే శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ను అతి తక్కువ రేటుకు అందజేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు షేక్ మౌలాతో మాట్లాడారు. దీనికోసం 1500 రూపాయల నగదును స్థానిక పోస్టాఫీస్లో చెల్లించాలని సూచించారు. స్మార్ట్ ఫోన్ తో పాటు అరతులం వెండి వస్తువులను కూడ పంపించామని అన్నారు.
ఈ ఫోన్ కాల్ అందిన వెంటనే షేక్ మౌలా చక్రయాపేట పోస్టాఫీస్ కు వెళ్లాడు. ఫోన్ లో గుర్తు తెలియని వ్యక్తులు చెప్పినవిధంగానే షేక్ మౌలా పేరు మీద ఓ పార్సెల్ అప్పటికే పోస్టాఫీస్ లో డెలివరీకి సిద్ధంగా ఉంది. దీనితో అతను నిజమేనని భ్రమించాడు. 1500 రూపాయలను చెల్లించి ఆ పార్సెల్ ను అందుకున్నాడు. ఇంటికెళ్లిన తరువాత దాన్ని తెరిచి చూసిన వెంటనే స్పృహ తప్పినంత పనైంది అతనికి. గుర్తు తెలియని వ్యక్తి చెప్పినట్లు అందులో ఎలాంటి స్మార్ట్ ఫోనూ లేదు. కొద్దిగా పీచు మిఠాయి, ఆంజనేయస్వామి లాకెట్, ఓ స్టీల్ ప్లేటు కనిపించాయి. దీనికోసం అతను 1500 రూపాయలను చెల్లించాల్సి వచ్చింది.