'సంతోషంగా చనిపోతున్నా'.. రన్నింగ్ ట్రైన్ నుండి దూకి ఆత్మహత్య
మీరు కోరుకొన్నట్టుగా .. మీరనుకొన్న లక్ష్యానికి అనుగుణంగా జీవించలేకపోతున్నా.. అందుకే నన్ను క్షమించండంటూ ఓ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కడప: మీరు కోరుకొన్నట్టుగా .. మీరనుకొన్న లక్ష్యానికి అనుగుణంగా జీవించలేకపోతున్నా.. అందుకే నన్ను క్షమించండంటూ ఓ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రన్నింగ్ ట్రైన్లో నుండి దూకి రమేష్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప జిల్లాలో సోమవారం జరిగింది.
'అమ్మ.. అప్ప.. నన్ను క్షమించండి.. నేను మీరు కోరుకున్నట్లు.. మీరు కలలు కన్నట్లు జీవించలేకపోతున్నాను' అని చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన వెంకట రమేష్కుమార్ సూసైడ్ నోట్ రాశాడు. సోమవారం మధాహ్నం ముంబై నుంచి చెన్నైకి వెళుతున్న రైలులో నుంచి అతను దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 'మీరందరూ అనుకున్నట్లు నేను ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఎటువంటి తప్పు చేయలేదని ఆ లేఖలో వెంకటరమేష్కుమార్ రాశారు.
మీరందరూ సుఖంగా.. సంతోషంగా ఉండాలని వచ్చేశాను. నా తప్పు తెలుసుకున్నాను. కాబట్టే అన్ని వదిలేసి వచ్చాను. కానీ మీరందరూ నా చావును కోరుకుంటే సంతోషంగా చనిపోతున్నాను. మీరు నా కోసం ఒక్క చుక్క కన్నీరు కూడా కార్చవద్దు. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయవద్దు.. మీరు నాకోసం కోల్పోయింది చాలు.. నా శవాన్ని కూడా ఇక్కడే వదిలేయండి. నా ఖర్మ కాండలు కూడా చేయవద్దని ప్రార్థిస్తున్నాను.
నన్ను క్షమించండి. నా దగ్గర రూ.3,100 డబ్బులు.. మొబైల్ ఉన్నాయి. అవి తీసుకోండి' అని లేఖలో పేర్కొన్నారని రైల్వే ఎస్ఐ రారాజు తెలిపారు. ఈ మేరకు మృతుడి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించామని ఆయన పేర్కొన్నారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించామని వివరించారు.