యూట్యూబ్ పిచ్చి ముదిరి! వ్యూస్ కోసం రైలు కింద గ్యాస్ సిలిండర్ అమర్చిన ఘనుడు
చిత్తూరు: తన సొంత యూట్యూబ్ ఛానల్ కు వ్యూస్ కోసం మనిషనేవాడు ఏ మాత్రం ఊహించని దారుణానికి పాల్పడ్డాడో యువకుడు. యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రిప్షన్, వ్యూస్, లైక్స్ సంఖ్యను పెంచుకోవడానికి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడటానికి ప్రయత్నించాడు. అతనికి పట్టిన సోషల్ మీడియా పిచ్చి వల్ల వందలాది మంది రైలు ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలు అయ్యాయి. అదృష్టం బాగుండి ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు.
ఆ యువకుడి పేరు రామిరెడ్డి. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలానికి చెందినవాడు. కొంతకాలంగా అతను సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తున్నాడు. తన యూట్యూబ్ ఛానల్ వ్యూస్ భారీగా పెరగాలనే ఉద్దేశంతో.. నడుస్తున్న రైలు కింద వంటగ్యాస్ సిలిండర్ ను అమర్చాడు. వేగంగా వచ్చే రైలు ఆ సిలిండర్ ను ఢీ కొట్టిన తరువాత సంభవించే పరిణామాలపై వీడియో చిత్రీకరించాలనేది అతని ప్లాన్. అనుకున్నట్టుగానే- రైలు పట్టాల మీద సిలిండర్ అమర్చాడు. కొద్దిదూరంలో తన సెల్ ఫోన్ కెమెరా సహాయంతో దాన్ని చిత్రీకరించడం మొదలు పెట్టాడు.
తిరుపతి వైపు వెళ్తోన్న ఓ రైలు ఆ సిలిండర్ ను ఢీ కొట్టింది. రైలు ఢీ కొట్టిన వేగానికి సిలిండర్ గాల్లోకి ఎగిరి, కొన్ని మీటర్ల దూరంలో పడింది. అదృష్టవశావత్తూ అది పేలలేదు. రైలు సిలిండర్ ను ఢీ కొట్టిన వెంటనే పేలిపోయి ఉంటే పెను ప్రమాదమే చోటు చేసుకుని ఉండేది. ఆయా సన్నివేశాలన్నింటినీ మొబైల్ కెమెరా ద్వారా చిత్రీకరించిన రామిరెడ్డి.. దాన్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు. ఆ వీడియోను చూసిన నరసింహ అనే వ్యక్తి.. దీన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. రామిరెడ్డిపై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు రామిరెడ్డిని అరెస్టు చేశారు. ప్రజా, రైల్వే ఆస్తుల ధ్వంసం కింద అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.