పురిటి బిడ్డను పక్క షేషెంట్ చేతిలో పెట్టి...పత్తాలేకుండా పోయిన తల్లి
అనంతపురం:అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఘటనను అసలు ఎలా అర్థం చేసుకోవాలో...అక్కడ జరిగిన తప్పుకు ఎవరిని బాధ్యుల్ని చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే...
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం పి.కొత్తపల్లికి చెందిన ప్రతాప్ అనే వ్యక్తికి ఇటీవలే రోడ్డు ప్రమాదంలో చెయ్యి విరగడంతో చికిత్స నిమిత్తం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. వారం రోజులు ఇన్ పేషెంట్ గా ఉండి చికిత్స పొందాడు. ఈ క్రమంలో మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చారయ్యేందుకు సిద్దమవుతున్నాడు.
ఇదే ఆస్పత్రిలో డెలివరీ కోసం చేరిన ఓ గర్భిణీ యువతి ప్రతాప్ తో ముఖపరిచయం ఏర్పరుచుకుంది. ఆ తరువాత కాన్పు కాగానే ఆ పసిబిడ్డతో ప్రతాప్ వద్దకు వచ్చి ఈ బిడ్డను చూస్తుండమని, ఇప్పుడే వస్తానని చెప్పి పత్తా లేకుండా పోయింది.
ఆమె కోసం ఎంత సేపు ఎదురు చూసినా రాకపోవడంతో ప్రతాప్ ఆ ఆడబిడ్డను ఇంటికి తీసుకువచ్చేశాడు. మరోవైపు ప్రతాప్ కుటుంబం విషయానికొస్తే ప్రతాప్ కు ముగ్గురు ఆడ పిల్లలు సంతానం. మగ బిడ్డ కావాలనే కోరికతో భార్య రాజేశ్వరికి ఆపరేషన్ చేయించక పోవడంతో ఆమె ఇప్పుడు గర్భవతి. ఈ క్రమంలో ప్రతాప్ ఇప్పుడు తీసుకువచ్చిన పాపతో మొత్తం నలుగురు ఆడపిల్లలు కాగా అయినా దేవుడిచ్చిన బిడ్డనే ఆలోచనతో ఆ ఆడబిడ్డను కూడా పెంచేందుకు సిద్దపడి 5 రోజులుగా వారే సాకుతున్నారు.
అయితే ఈ విషయం ఆనోటా ఈనోటా పడి గ్రామంలోని అంగన్వాడీ కార్యకర్త గోవిందమ్మ సమాచారం అందడంతో ఆమె విషయం తెలుసుకుని ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీడీపీఓ పి.కొత్తపల్లికి చేరుకుని ప్రతాప్, రాజేశ్వరి దంపతుల వద్ద ఉన్న ఆ శిశువును స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం శిశువును వైద్య పరీక్షల నిమిత్తం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు.
మరోవైపు ఆ బాలిక తల్లి గురించి ప్రతాప్ ను అడుగగా ఆమె ఇంజనీరింగ్ చదువుతున్నట్లు చెప్పినట్లు తెలిపాడు. దీంతో విద్యార్థిని అయిన ఆ యువతి అవాంఛిత గర్భం కారణంగా ఈ రకంగా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.