లవ్..సెక్స్..ధోకా! ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా!
విజయవాడ: ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువకుడు దారుణానికి తెగించాడు. ఓ యువతిని నమ్మించి, వంచించాడు. శారీరక అవసరాలను తీర్చుకున్నాడు. అనంతరం- వదిలేశాడు. తాను మోసపోయినట్టు గ్రహించిన బాధితు యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు కూర్చున్నారు. రాత్రంతా ప్రియుడి ఇంటి ముందే కూర్చుని ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఎలాగూ తన పరువు పోయిందని, ప్రియుడు తనను పెళ్లి చేసుకోకపోతే.. ఇక ఆత్మహత్యే శరణ్యమంటూ బాధితురాలు వాపోతున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కీలేశపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బాధిత యువతి పేరు భాగ్యలక్ష్మి. విజయవాడ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటున్నారు. రెండేళ్ల కిందట కీలేశపురం గ్రామానికి చెందిన జోసెఫ్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని జోసెఫ్ ఆమెను నమ్మించాడు. శారీరక అవసరాలను తీర్చుకున్నాడు. బాధితురాలి కుటుంబం ఆర్థికంగా ఉన్నవాళ్లే కావడంతో.. ఆమె నుంచి డబ్బులు కూడా వసూలు చేసినట్లు తెలుస్తోంది.
కొద్దిరోజుల నుంచి భాగ్యలక్ష్మి పెళ్లి చేసుకోవాలని జోసెఫ్ పై ఒత్తిడి తెస్తున్నారు. పెళ్లి మాట ఎత్తేసరికి జోసెఫ్ ముఖం చాటేయడం మొదలు పెట్టాడు. భాగ్యలక్ష్మితో మాట్లాడటం మానేశాడు. ఫోన్ చేస్తే సమాధానం ఇచ్చేవాడు కాదు. చివరికి మొబైల్ నంబర్ మార్చేశాడు. దీనితో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బాధిత యువతి జోసెఫ్ ఇంటి ముందు ధర్నాకు కూర్చున్నారు. కీలేశపురంలోని జోసెప్ ఇంటి వద్ద బైఠాయించారు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
అప్పు తీర్చుతావా .. చస్తావా .. నడిరోడ్డుపై గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి !
జోసెఫ్ తనను పెళ్ళి చేసుకోవాలని.. లేదంటే అతడి ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని బాధిత యువతి వాపోయారు. జోసెఫ్ పై తాను ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎలాంటి ఫలితం రాలేదని అన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆందోళనకు దిగాల్సి వచ్చిందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. విజయవాడకు చెందిన కొందరు మహిళా సంఘాల ప్రతినిధులు భాగ్యలక్ష్మికి అండగా నిలిచారు. జోసెఫ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.