ప్రియమైన అమ్మకు..! ప్రపంచంలోనే ఎత్తయిన పోస్టాఫీస్ నుంచి లేఖ రాసిన వైజాగ్ అమ్మాయి
విశాఖపట్నం: ప్రపంచంలోనే ఎత్తయిన పోస్టాఫీస్ హిక్కిం. హిమాచల్ ప్రదేశ్ లో ఎత్తయిన పర్వత శిఖరాల అంచుల మీద, మంచు దుప్పటి కప్పుకొని ఉన్నట్టు కనిపించే స్పితి వేలీ పరిధిలోని హిక్కిం గ్రామం.. సముద్ర మట్టం నుంచి 4,400 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ గ్రామాన్ని పర్వత శిఖరారోహకులు స్వర్గధామంలా భావిస్తుంటారు. ట్రెక్కింగ్ కోసం ఏటా వందల సంఖ్యలో సాహస యాత్రీకులు ఇక్కడికి వెళ్తుంటారు. ట్రెక్కింగ్ కోసం వెళ్లిన విశాఖపట్నానికి చెందిన అనూష పుప్పాల అనే అమ్మాయి హిక్కిం నుంచి తన తల్లికి ఓ లేఖ రాశారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రపంచ తపాలా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ఈ లేఖను రాశారు.. తెలుగులో.
ప్రియమైన అమ్మకు.. అంటూ లేఖను ఆరంభించారు. ప్రపంచంలోనే ఎత్తయిన పోస్టాఫీస్ నుంచి తాను లేఖను రాస్తున్నానని పేర్కొన్నారు. తాను ఎన్ని శిఖరాలను అధిరోహించినా, ఎంత ఎత్తుకు చేరుకున్నా, ఎన్ని విజయాలను సాధించినా.. అది కేవలం నీ వల్లే అని తన ఆప్యాయతను చాటుకున్నారు. తల్లి రుణాన్ని తీర్చుకోలేమని చెప్పారు. ఈ లేఖ ఫొటోను అనూషా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. వాట్సప్, ఫేస్ బుక్, ఇమెయిల్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా అందుబాటులో ఉన్న కాలంలో కూడా తపాలా శాఖ తన ప్రత్యేకతను చాటుకుంటోందని పేర్కొన్నారు.
హిమాచల్ప్రదేశ్ లోని కాజా పట్టణానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉండే హిక్కిం పోస్టాఫీసు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పోస్టాఫీసుగా రికార్డు సృష్టించింది. 1985 నవంబర్ 5వ తేదీన హిక్కిం పోస్టాఫీసులో కార్యకలాపాలు ఆరంభం అయ్యాయి. సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ వంటి ఎటువంటి ఆధునిక సదుపాయాలు లేని హిక్కిం గ్రామానికి ఈ పోస్టాఫీసు ఒక్కటే ఆధారం. ఈ గ్రామంలో 200 వరకు కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇంటర్నెట్ లేకపోవడం వల్ల వాట్సప్, ఇమెయిల్ వంటి సౌకర్యాల గురించి హిక్కిం గ్రామస్తులకు పెద్దగా తెలియదు. అందుకే- ఈ పోస్టాఫీసు మీదే ఆధారపడుతుంటారు. చలికాలంలో విపరీతంగా మంచు కురవడం వల్ల దీన్ని కొద్దిరోజుల పాటు మూసేస్తుంటారు.