పెళ్లి పేరుతో అబ్బాయిలను ట్రాప్ చేస్తున్న మాయలేడి..స్వీట్ గా మాట్లాడి లక్షలలోనే టోకరా!!
అమ్మాయిలను , అబ్బాయిలు మోసం చెయ్యటమే కాదు అమ్మాయిలే అబ్బాయిలను మోసం చేస్తున్న సంఘటనలు రాష్ట్రంలో నిత్యకృత్యంగా మారాయి . పెద్దింటి అబ్బాయిలను టార్గెట్ చేసి వల వేసిన ఓ యువతి పెళ్లి పేరు చెప్పి అడ్డంగా వారిని దోచేస్తోంది. మ్యాట్రిమోనీ లో అందమైన ఫోటోలతో ప్రొఫైల్స్ క్రియేట్ చేయడం, ఆపై మంచి ప్రొఫైల్ ఉన్న అబ్బాయి లను చూసి వారి కాంటాక్ట్ నెంబర్ తీసుకుని చాటింగ్ చేయడం, ఫోన్ కాల్స్ ద్వారా దగ్గరవడం, పెళ్ళి చేసుకుంటానంటూ తీయటి మాటలు చెప్పడం, ఆపై వారి వద్దనుండి అందినకాడికి దండుకుంటున్న సదరు యువతి చాలా మంది అబ్బాయిలను బకరాలు చేసింది.
పెళ్లి పేరుతో మోసాలకు పాలపడుతున్న మాయలేడి గుట్టు రట్టు
పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఒక యువతి వ్యవహారం ఓ మధ్యతరగతి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో బట్టబయలైంది. నెల్లూరు జిల్లాకు చెందిన స్వాతి అనే యువతి ఎంబీఏ పూర్తి చేసింది. ఆమె భర్త ఒక ప్రైవేటు కళాశాలలో లెక్చరర్ గా పని చేస్తున్నారు. పెద్దింటి అమ్మాయిగా మంచి హోదాలో ఉన్నట్లుగా మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లలో ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, అందుకు తగినట్లుగా అందమైన అమ్మాయిల ఫోటోలు అప్లోడ్ చేసి ఆసక్తి చూపించిన వారిని టార్గెట్ చేసేది.
అమెరికా నుండి ఫోన్ చేస్తున్నట్టు నమ్మించి మాయమాటలతో మోసం
తియ్యని మాటలు చెబుతూ వారితో చనువు పెంచుకుని, తాను అమెరికా నుంచి ఫోన్ చేస్తున్నట్లుగా నమ్మించడం కోసం వర్చువల్ ఫోన్ నెంబర్లు వాడేది. చాలా మంది అబ్బాయిలతో అలా పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి బుట్టలో వేసుకునేది సదరు కిలాడి . ఇక ఇండియాకు వస్తున్నానని, వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారి ముందు ఏదో ఒక అవసరం అని చెప్పి డబ్బులు అడిగేది. స్వాతి చెప్పిన మాటలన్నీ నిజమని నమ్మిన చాలా మంది యువకులు ఆమె అడిగినంత డబ్బులు స్వాతి కి పంపేవారు.
డబ్బులు దండుకున్నాక సంబంధాలు కట్ చేసుకున్న కిలాడి
ఇక వారి వద్ద నుండి డబ్బులు వచ్చిన తర్వాత స్వాతి వారితో సంబంధాన్ని కట్ చేసుకునేది. ఇలా చాలామంది అబ్బాయిలను పెళ్లి చేసుకుంటానని ట్రాప్ చేసి మోసం చేసిన యువతి గుట్టును రట్టు చేశారు నెల్లూరు పోలీసులు. స్వాతి మాయ మాటలు నమ్మి మోసపోయిన ఒక కుటుంబం 5 లక్షల రూపాయలు పోగొట్టుకున్నామంటూ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా, పోలీసుల విచారణలో స్వాతి నేరాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. దీంతో పోలీసులు స్వాతిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గతంలోనూ మోడల్ ఫోటోలు పెట్టి మోసం
గతంలోనూ ఒక మోడల్ ఫోటోలు పెట్టి తానేనని చెప్పి పెళ్లి చేసుకోవాలని మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్ పెట్టిన యువకుడిని ఒక యువతి మోసం చేసింది. అతని వద్ద నుండి విడతలవారీగా 7 లక్షల 20 వేల రూపాయలు వసూలు చేసింది . అమ్మాయి అడిగినప్పుడల్లా అమౌంట్ ట్రాన్స్ ఫర్ చేస్తూ పోయాడు యువకుడు. చివరకు మోసపోయానని తెలిసి లబోదిబోమన్నారు . ఇప్పుడు కూడా అలాంటి మోసానికే పాల్పడింది మరో మాయలేడి.