విషాదం:ప్రేమికుల రోజునే ప్రియుడు ఆత్మహత్య, ప్రియురాలి కుటుంబసభ్యులపై అనుమానాలు?
కర్నూల్ జిల్లా నంద్యాలలో విష్ణువర్థన్ అలియాస్ చిన్నా అనే యువకుడు సోమవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. ప్రియురాలు వేరే వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో మనోవేదనకు గురై అతను ఆత్మహత్య.
నంద్యాల:ప్రేమికుల రోజునే ఓ ప్రేమికుడు ఆత్మహత్య చేసుకొన్నాడు.తాను ప్రేమించిన యువతి మరోకరితో వివాహనికి సిద్దపడిన విషయం తెలుసుకొని అతను ఆత్మహత్య చేసుకొన్నాడు.అయితే ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
ప్రేమికుల దినోత్సవం రోజున ప్రేమికులు చాలా ఎంజాయి చేస్తారు. ఈ రోజు కోసం ఏడాది పొడవునా ఎదురుచూస్తుంటారు.అయితే ప్రేమికుల దినోత్సవం రోజునే ఓ యువకుడు ఆత్మహత్యచేసుకొన్నాడు. ప్రియురాలు వేరే వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడంతోనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని లేఖ రాశాడు.
కర్నూల్ జిల్లా నంద్యాలలోని అరుంధతీనగర్ కు చెందిన కృష్ణయ్య కొడుకు విష్ణువర్థన్ అలియాస్ చిన్నా ఎన్ జి ఓ కాలనీలో ఓ గదిలో ఉరివేసుకొని మృతి చెందాడు.
చిన్నా నంద్యాల పట్టణానికి చెందిన ఓ యువతి మూడేళ్ళుగా ప్రేమించుకొంటున్నారు. వీరి ప్రేమ వ్యవహరం ఇరు కుటుంబాల్లో తెలిసింది.అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు వేరే అబ్బాయితో వివాహం చేయాలని నిర్ణయించారు. అప్పటి నుండి ప్రియురాలు చిన్నాకు దూరంగా ఉంటోంది.
ప్రియురాలు తనకు దూరంగా ఉంటున్న రోజు నుండి చిన్నా మనోవేదనకు గురయ్యాడు. అయితే ఇంట్లో వాళ్ళకు మాత్రం తాను ఊరికి వెళ్తున్నానని చెప్పి ఎన్ జి ఓ కాలనీలో అద్దెకు తీసుకొన్న రూమ్ లో సోమవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడని పోలీసులు తెలిపారు.
తెల్లవారిన తర్వాత మంగళవారం నాడు ఉదయం స్థానికులు విషయాన్ని గుర్తించారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. రాత్రి సమయంలో ఉరివేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.మృతదేహన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
మృతిపై అనుమానాలు
చిన్నా మృతిపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గదిలో ప్రియురాలు చున్నీతో ఉరి వేసుకొన్నాడు. అలాగే సూసైడ్ నోట్ లో ఉన్న చేతి రాతపై కూడ కుటుంబసభ్యులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
యువతి తరపు వారే తన కొడుకును హత్య చేసి ఆత్మహత్య చేసుకొన్నాడని చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేశారు.