మీ అంకిత భావానికి జోహార్లు..! సీసీసీ నిర్వాహకులకు మెగాస్టార్ వాయిస్ మెస్సేజ్..!!
హైదరాబాద్ : కరోనా వైరస్ నుండి బయటపడేందుకు ఇండియా లాక్ డౌన్ ఆంక్షలను కొనసాగిస్తోంది. దేశ ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని కేంద్ర, రాష్ట్రాల ఆదేవాలు అమలులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక మంది దినసరి కూలీలు, వలస కార్మికులు జీవానోపాది కోల్పోయారు. ప్రభుత్వాలు అందిస్తున్న చేయూత కూడా వీరికి అందకపోవడంతో అనేక సమస్యల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. సరిగ్గా ఇదే కోవకు చెందిన వేలాది సిని కర్మికులు కూడా కరోనా కష్టకాలంలో జీవనోపాది కోల్పోయారు.
సీసీసీ నిర్వహకులకు ప్రశంసలు.. వాయిస్ మెస్సేజ్ పంపించిన చిరంజీవి..
వీరిని ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి ఓ బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో ఓ నిధిని ఏర్పాటు చేసి దాని ద్వారా ఉపాది కోల్పోయిన వేలాది మంది సినీ కార్మికులకులను అక్కున చేర్చుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. అంతే కాకుండా కరోనా క్రైసిస్ ఛారిటీ తరుపున చేసే కార్యక్రమాల పట్ల నిర్వాహకులు చూపిస్తున్న అంకిత భావానికి చిరంజీవి మంత్రముగ్థులయ్యారు. క్లిష్ట సమయంలో వారు చేస్తున్న సేవలను అభినందిస్తూ సీసీసీ నిర్వహకులకు వాయిస్ సందేశం పంపించారు చిరంజీవి.
చిరంజీవి బృహత్కర ఆలోచన.. సీసీసీ ద్వారా వేలాది మంది సినీ కార్మికులకు జీవనోపాది..
కొందరు వ్యక్తులు ఏ పని చేసినా ఊహించని విజయం సొంతమవుతుంది. జీవనోపాది కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు చిరంజీవి నేతృత్వంలో నడుస్తున్న కరోనా క్రైసిస్ ఛారిటీ కూడా ఊహించని రీతిలో విజయవంతంగా దూసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. నిత్యావసర సరుకులను నేరుగా సినీ కార్మికుల ఇళ్లకే తీసుకెళ్లి ఇస్తున్న నిర్వహకుల సేవా దృక్పదాన్ని మెగాస్టార్ ప్రశంసిస్తున్నారు. కోట్ల రూపాయల డబ్బున్నా సేవ చేయాలన్న తపన లేనప్పుడు అవి వృధాకావాల్సిందేనని అభిర్ణిచారు చిరంజీవి.
చిరంజీవి మెచ్చుకోవడం ఆనందంగా ఉంది.. వంద సునామీల బలంతో పనిచేస్తామంటున్న నిర్వాహకులు..
తాను ఇచ్చిన పిలుపుకు కట్టుబడి, ఎక్కడా చిన్న పొరాపాటు జరగకుండా పేద సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిస్తున్న కార్మికులకు ఆయన వాయిస్ సందేశం పంపించారు. చిరంజీవి వాయిస్ సందేశం ద్వారా ప్రశంసలు అందుకున్న మెహర్ బాబా నిర్వహకులు మాత్రం ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. చిరంజీవి వాయిస్ మెస్సేజ్ ద్వారా తమ పని విధానాన్ని మెచ్చుకోవడం వల్ల వంద సునామీల బలం వచ్చినట్టు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి ఇచ్చిన ఉత్సాహంతో మరింత కష్టపడేందుకు సిద్దంగా ఉన్నట్టు ఛీఫ్ ఆర్గనైజర్ దీవెల శ్రీనివాస్ చెప్పుకొస్తున్నారు. లాక్ డౌన్ ఆంక్షలు ముగిసేంత వరకూ క్షేత్ర స్దాయిలో పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు.
చిరంజీవిది ఉదార స్వభావం.. ఆయనే మాకు ఆదర్శం అంటున్న నిర్వహకులు..
చిరంజీవి లాంటి మెగాస్టార్ ఆదేశాలకనుగుణంగా పని చేయడం పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నట్టు స్పష్టం చేస్తున్నారు. ఒక్క లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రల్లో ఎలాంటి విపత్తులు సంభవించినా చిరంజీవి ఆదేశిస్తే రంగంలోకి దిగి సేవలందించడానికి సిద్దంగా ఉన్నట్టు చెప్పుకొస్తున్నారు. లాక్ డౌన్ ఆంక్షలు అమలులోకి వచ్చిన మరు క్షణమే చిరంజీవి సిని కార్మికుల మనుగడ గురించి అత్యద్బుతంగా స్పందించారని, ఇలాంటి గొప్ప ఆలోచన కొంత మందికే వస్తుందని చిరంజీవిపై ప్రశంసల ఝల్లు కురిపిస్తున్నారు మెహర్ బాబా నిర్వహకులు.