మీ స్నేహం గడువు ముగిసింది..! రీఛార్జ్ చేసుకునే అవకాశం కూడా కోల్పోయారు..జగన్ కు బీజేపి స్పష్టం
అమరావతి/హైదరాబాద్ : ఏపిలో రాజకీయా పరిణామాలు మారుతున్నాయి. పాలనలో నెలకొన్న అవరోధాలను దాటుకుంటూ వైసీపీ ప్రభుత్వం కుదురుకుంటున్నతరుణంలో ఆ పార్టీకి అనుకోని శత్రువులు శరాఘాతంగా మారుతున్నారు. ప్రతి అంశాన్ని విమర్శిస్తూ ప్రథమ శత్రువు టీడీపీ తన ముద్రను వేసుకుంటే, ఎన్నికలకు ముందు, ఆ తరువాత కూడా కొద్దికాలం పాటు వైసీపీ పట్ల సానుకూలంగా వ్యవహరించిన బీజేపీ ఇప్పుడు వైసీపీకి ఎదురు తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆ రెండు పార్టీల మద్య ఏర్పడ్డ సామరస్య వాతావరణానికి భంగం కలిగినట్టు తెలుస్తోంది.
వైసీపిని దూరం పెడుతున్న బీజేపి.. క్షేత్ర స్థాయిలో బలపడేందుకు కాషాయం ప్రయత్నాలు..
అందుకు వైసీపిని బీజేపీ టార్గెట్ చేసినట్టు కొన్ని ఉదంతాలు నిరూపిస్తున్నాయి. వాస్తవానికి బీజేపీ బలం, మోదీ, అమిత్షాల సత్తా పూర్తిగా అర్థం చేసుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లకే కమలం పార్టీకి తాను విధేయుడిగా ఉంటాననే సంకేతాలిచ్చారు. అదేవిధంగా నడుచుకున్నారు కూడా. కాని ప్రస్తుత పరిస్తితుల్లో ఊహించని మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. కేంద్ర బీజేపి సర్కార్ జగన్ ప్రభుత్వానికి నామమాత్రపు సమయం ఇచ్చి తర్వాత తాను చేయాల్సింది చేసే విధంగా ఏపిలో కార్యాచరణకు దిగుతున్నట్టు తెలుస్తోంది.
బీజేపి కి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఏపి సీఎం.. మోకాలడ్డు పెడుతున్న బీజేపి..
ఇక బీజేపీ తన జోలికి రాకుండా కనీసం రెండు దఫాలుగా ఎలాంటి ఇబ్బందులకు గిరి చేయకుండా ఉండే విధంగా తానే తగ్గి ఉండాలని జగన్ బావించినట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, హోం మంత్రిగా అమిత్ షా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజులకే ప్రత్యేక హోదా అంశంలో బీజేపి వల్ల ఏపి కి ఒరిగేదేమీ ఉండదని చెప్పడం వంటి వన్నీ దీనికి ఉదాహరణలుగా చెప్పొచ్చు. అయితే, ఇవేవీ ఏపీలో విస్తరించాలనుకుంటున్న బీజేపీ లక్ష్యాన్ని నిలువరించలేకపోతున్నట్టు తెలుస్తోంది. జగన్ కు దగ్గరయ్యే కన్నా, దూరంగా ఉంటూ ఏపి లో బలపడాలని బీజేపి భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది.
అమీత్ షా, మోదీ తో జగన్ విధేయత.. ఇక చాలు అంటున్న బీజేపి అగ్ర నేతలు..
మరోవైపు ఎన్నికలకు ముందు వరకూ బీజేపీతో సన్నిహితంగా ఉన్న జగన్, ఆ తరువాత కూడా విధేయత చూపిస్తున్నా అదంతా స్వప్రయోజనాలకోసమేనని బీజేపీ ఓ అంచానుకు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకు కారణం విద్యుత్ పీపీఏలు, పోలవరం రీటెండర్లు వంటి విషయాల్లో కేంద్రం మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా జగన్ మొండి పట్టుదలకు పోవడమేనని తెలుస్తోంది. ఈ రెండు పరిణామాలు కేంద్రానికి ఆగ్రహం తెప్పించాయంటున్నారు. బీజేపీ అధిష్ఠానం వైఖరిని అర్థం చేసుకున్న రాష్ట్ర బీజేపీ కూడా వైసీపీపై పూర్తిస్థాయి పోరాటానికే సిద్ధమైంది. ఆ క్రమంలోనే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కంటే ఎక్కువగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపి ప్లాన్.. అందుకోసం కఠిన నిర్ణయాలంటున్న కమలం..
అంతేగాక ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలను సైతం భారీగానే బీజేపి ప్రోత్సహిస్తోంది. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు రీ టెండర్ల ప్రక్రియ పూర్తయిన తరువాత ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిర్మాణం నేరుగా కేంద్రమే చేపట్టేలా కార్యాచరణ సిద్ధమవుతోందన్న వార్తలు తెరమీదకు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు లేకుండా పథకం ప్రకారం ముందుకు వెళ్తున్నట్టు సమాచారం. ఇక పీపీఏ విధానంలో చేపట్టిన సౌర, పవన విద్యుత్ విషయంలో తమ మాట పెడచెవిన పెట్టినందున కేంద్రం బొగ్గు సరఫరా విషయంలో కూడా రాష్ట్రానికి సహకరించే అవకాశం లేదని బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడటం ఖాయమని, అదే జరిగితే ఏపి ప్రజానికంలో జగన్ ప్రభుత్వంపై పూర్తిస్థాయి వ్యతిరేకత వస్తుందని బీజేపి నేతలు భావిస్తున్నారు.
ఎవరి దారి వారిది.. వచ్చే ఎన్నికల్లో తేల్చుకునే దిశగా బీజేపి..
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలతో భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో సీఎం జగన్కు బీజేపీ సహకారం ఉండబోదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర నాయకులు రాజకీయపరంగా వ్యవహరిస్తుండగా బీజేపీ ఏపీ వ్యవహారాలు చూసుకుంటున్న సునీల్ దేవధర్ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. స్థానిక నాయకత్వం, క్యాడర్ను నిర్మించుకుంటూ ఆయన బీజేపీని గ్రామస్థాయిలోనూ బలోపేతం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే జగన్ తో బీజేపి సఖ్యత గడువు ముగిసి బీజేపీ ఆట మొదలెట్టినట్లుగా సంకేతాలు వెలువడుతున్నట్టు చర్చ జరుగుతోంది.