3 రోజుల్లో పెళ్ళి: వరుడు మృతి, ఏమైందంటే?
హైదరాబాద్: కడప జిల్లా లింగాల మండలంలోని దొండ్లవాగు గ్రామ సమీపంలో ఆదివారం నాడు రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో పెళ్ళి కాబోయే యువకుడు మృతి చెందాడు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
కడప జిల్లా పులివెందులకు చెందిన జి మరియమ్మ, సంరాజుల కొడుకు శేఖర్బాబు కు జమ్మలమడుగు మండలం గూడెం చెరువుకు గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది,.
మే 17వ తేదిన వివాహం పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరగాల్సి ఉంది. అయితే ఈ వివాహానికి ఆహ్వనించేందుకుగాను పెళ్ళి పత్రికలను పంచేందుకు మోటార్ సైకిల్పై శేఖర్ బాబు వెళ్ళాడు. పులివెందుల నుండి సింహాద్రిపురం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం శేఖర్బాబు వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో శేఖర్ బాబు మోటార్ బైక్ పై నుండి పడి కిందపడ్డాడు.
రోడ్డుకు బలంగా శేఖర్ బాబు తల తగిలింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా శేఖర్ బాబు మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదంలో శేఖర్ బాబు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహన్ని పులివెందుల ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.