సెల్ఫీ పిచ్చి:గూడ్స్ రైలు ఎక్కి...కరెంట్ షాక్ తో ప్రాణం మీదకు!
విజయవాడ:సెల్ఫీల పిచ్చి మరో యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. గూడ్స్ ట్రైన్తో సెల్ఫీ దిగాలన్న ఉబలాటం ఆ యువకుడిని ప్రాణాపాయంలోకి నెట్టింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట శివార్లలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
రైలు పట్టాలపై గూడ్స్ ట్రెయిన్ ఆగి ఉండడంతో సాయి అనే యువకుడు ఆ ట్రెయిన్ ఎక్కి సెల్ఫీ దిగాలని భావించాడు. వెంటనే గబగబా గూడ్స్ ఇంజన్ మీదకు ఎక్కేశాడు. ఆ తరువాత సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ఉండగానే ట్రాక్ పైన ఉండే హైటెన్షన్ విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తూ చేతికి తగిలాయి. దీంతో ఒక్కసారిగా హై ఓల్టేజ్ విద్యుత్ శరీరంలోకి ప్రవేశించడంతో తీవ్రమైన విద్యుద్ఘాతానికి గురై కిందపడ్డాడు.
దీంతో తీవ్రంగా గాయపడిన సాయిని స్థానికులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. సాయి పరిస్థితి పరిశీలించిన వైద్యులు అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోలనకరంగానే ఉన్నట్లు తెలిపారు. ఐసియులో ఉంచి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మరోవైపు యువకుల సెల్ఫీల పిచ్చిపై తల్లదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా రైళ్లెక్కి సెల్ఫీలు దిగే క్రమంలో దేశవ్యాప్తంగా అనేకమంది యువకులు ప్రాణాలు కోల్పోవడం, కరెంట్ షాక్ గురవడం జరగగా...అయినప్పటికీ యువకుల్లో పరివర్తన రాకపోవడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ భరత్నగర్లో కూడా రన్నింగ్లో ఉన్న ట్రైన్ ముందు సెల్ఫీ దిగుతూ ఓ యువకుడు ప్రమాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.