టీవీ యాంకర్కు లైంగిక వేధింపులు, ప్రేమ పెళ్లిలో ట్విస్ట్
హైదరాబాద్: పెళ్లి చేసుకోవాలని యువతిని వేధిస్తున్ వ్యక్తి పైన వనస్థలిపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రశాంత్ నగర్లో ఉంటున్న 28 ఏళ్ల యువతి ఓ ఛానల్లో యాంకర్గా పని చేస్తున్నారు. గతంలో ఆమెతో పరిచయం ఉన్న హర్యానాకు చెందిన ఆశిష్ బిష్ణోయ్ అనే 33 ఏళ్ల వ్యక్తి కొంతకాలంగా పెళ్లి చేసుకోవాలని ఆమెను వేధిస్తున్నాడు.
పెళ్లికి అంగీకరించకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. వీడియోలను, ఫోటోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడు. బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. అతనికి ఇద్దరితో వివాహం అయిందని, ముగ్గురు సంతానం ఉన్నారని పోలీసులు తెలిపారు.
మరోవైపు, పదేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి.. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత తల్లిదండ్రులు బలవంతం చేస్తున్నారంటూ మరో పెళ్లికి రెడీ అయ్యాడట. దీనిపై మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. భర్త తీరుపై పోలీసులను ఆశ్రయించింది. తన భర్తను తన దగ్గరకు పంపాలని కోరుతోంది.
సంధ్య ఇంటర్ చదువుతుండగా... నవీన్ కుమార్తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2010లో వీరు పెళ్లి చేసుకుని విజయవాడ పటమట రామచంద్రానగర్లో కాపురం పెట్టారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మే 16న కుమార్తెను తీసుకుని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. అప్పటి నుంచి పలు మార్లు ప్రాధేయపడినా భార్య దగ్గరకు రావడం లేదు.
దీంతో తన మామ కారణంగా తన భర్త తన దగ్గరకు రావడం మానేశాడని, తన కుమార్తెను కూడా తనకు చూపించడం లేదని ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. తమ మామ తన భర్తకు రెండో పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.