ప్రేయసిని రేప్ చేసి చేతులు మంచానికి కట్టేసి గొంతు కోశాడు
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. బాల్య స్నేహితురాలనే విషయన్ని కూడా మరిచిపోయి ఓ యువకుడు యువతిని చంపేశాడు. వారి స్నేహం ప్రేమగా మారింది. అయితే, అతను ఆమె పట్ల అత్యంత నీచంగా వ్యవహరించాడు.
అనుమానంతోనే అతను ఆమె పట్ల అత్యంత నీచంగా వ్యవహరించడమే కాకుండా మానవత్వం మరిచి ఆమెను చంపేశాడు.అతనిపై వేటపాలెం పోలీసులు కేసు నమోదుచేశారు.
నమ్మించి ఇలా చేశాడు..
యువతిని నమ్మించి ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దాంతో ఆగకుండా మంచానికి కట్టేసి గొంతుకోసి హత్య చేశాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు అతనికి సహకరించిన కుటుంబ సభ్యులను కూడా వేటపాలెం పోలీసులు అరెస్టు చేశారు.డీఎస్పీ డాక్టర్ ప్రేమ్ కాజల్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
వారిద్దరు చిన్ననాటి స్నేహితులు...
వేటపాలెం జీవరక్ష నగర్కు చెందిన వల్లెపు గోపీచంద్, పాత చీరాలకు చెందిన శవనం లక్ష్మీమణితేజ బాల్య స్నేహితులు. వారి మధ్య ప్రేమగా వికసించింది. మణితేజ ఎంటెక్ చదువుతూ చీరాలలోని టీవీఎస్ షోరూంలో పనిచేస్తుండగా గోపిచంద్ ఆటో నడుపుతున్నాడు. అయితే క్రమంగా ఆమెపై అతనికి అనుమానం కలుగుతూ వచ్చింది.
ఆ విషయాన్ని వారికి చెప్పాడు..
తనకు ఆమెపై కలుగుతున్న అనుమానాలను తల్లిదండ్రులకు, అక్క చెల్లెళ్లకు చెప్పాడు. దీంతో అందరు కలిసి ఆమెను చంపాలని పథకం వేసుకున్నారు. వారు వేసుకున్న పథకం ప్రకారం రామానగర్లోని అతని మేనమామ ఇంట్లో ఆమెను హత్య చేయాలని అనుకున్నారు. ఆమెను అతను నమ్మించి రామానగర్ తీసుకెళ్లాడు.
లైంగిక దాడి ఆ తర్వాత ఇలా..
ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన అతను తర్వాత రెండు చేతులూ మంచానికి కట్టేసి పీక కోసి చంపేశాడు. ఆమెపై బంగారం గొలుసు, ఉంగరం, గాజులు తీసుకుని పారిపోయాడు. గోపీచంద్ తన తల్లిదండ్రులు జ్యోతి, శ్రీనివాసరావు, చెల్లెళ్లు లావణ్య, జ్యోత్స్నలను మొదట బాపట్లకు తీసుకుని వెల్లాడు. అనంతరం కర్ణాటక రాష్టంలోని బీదర్, హుబ్లీ అనేక ప్రాంతాల్లో మారు పేర్లతో వివిద పనులు చేస్తూ వచ్చాడు.
మూడు నెలలుగా పోలీసుల కళ్లు గప్పి..
అతని కోసం పోలీసులు మూడు నెలల పాటు గాలించారు. ఎట్టకేలకు వారిని అదుపులోకి తీసుకుని కేసును ఛేదించారు. బంగారు నగలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, వేటపాలెం ఎస్ఐ వెంకట కృష్ణయ్య, ఏఎస్ఐలు శ్రీనివాసరావు, ప్రసాద్, కానిస్టేబుళ్లు, హోంగార్డులకు ఎస్పీ రివార్డులు ప్రకటించారు.