రాజధాని పోరు : తుళ్లూరులో యువకుడి ఆత్మహత్యాయత్నం.. ఉద్రిక్తతలు..
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ అక్కడి రైతులు చేస్తున్న ఆందోళనలు శనివారానికి 25వ రోజుకు చేరుకున్నాయి. వెలగపూడి,తుళ్లూరు,మందడం చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసుకుని ధర్నాలు చేస్తున్నారు. కొన్నిచోట్ల పోలీసులు టెంట్లు వేయకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. తాజాగా తుళ్లూరులోని మహాధర్నా శిబిరం వద్ద జానీ అనే ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ధర్నా శిబిరం వద్దకు పెట్రోల్ బాటిల్తో వచ్చిన జానీ.. ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోబోయాడు. అక్కడున్నవారు వెంటనే అప్రమత్తమై ఆత్మహత్యను అడ్డుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
నేడు జాతీయ మహిళా కమిషన్ రాజధాని ప్రాంతాల్లో పర్యటిస్తుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. దీక్షా శిబిరాలు ఏర్పాటు చేయవద్దని పోలీసులు అడ్డుకోవడంతో మందడంలో రైతులకు,పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు స్వల్ప లాఠీ చార్జి చేయడంతో ఓ మహిళ చేయి విరిగినట్టు తెలుస్తోంది. ఇటీవల చినకాకానిలో రహదారిని దిగ్భందించి ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడికి పాల్పడ్డ కేసులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారెంట్ లేకుండా ఇళ్లల్లోకి వస్తున్నారని చెబుతున్నారు.
మరోవైపు ప్రభుత్వ నిర్బంధాలకు భయపడేది లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. రాజధాని ప్రాంతంలో మహిళల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును జాతీయ మహిళా కమిషన్కు వివరిస్తామని చెప్పారు. ఇక అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతిలో ర్యాలీ చేసి తీరుతామని మాజీ మంత్రి,టీడీపీ నేత అమరనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు అనేక ఆంక్షలు విధిస్తున్నారని, ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.
కాగా,శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న మహిళల పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని, అసభ్యకరమైన భాష వాడుతున్నారని, మహిళల ఆత్మాభిమానం దెబ్బతినేలా పోలీసులు వ్యవహ రిస్తున్నారని, అక్రమ కేసులతో జైళ్లకు పంపుతున్నారని.. రాజధాని ప్రాంత మహిళలు జాతీయ మహిళా కమిషన్కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులు చేశారు. టీడీపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ లిఖిత పూర్వకంగా ఢిల్లీలో ఇటీవల కమిషన్కు ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదులను సుమోటో కేసుగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ నేడు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తోంది.