చేపలమ్ముకుంటున్నా, నా సంగతేంటి!: బాబును కంగుతినిపించిన యువకుడు
విశాఖ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఊహించని ప్రశ్న ఎదురయింది! ఈ సంఘటన ఆదివారం నాడు జరిగింది. తాను డిఎస్సీ పాసైన చేపలు అమ్ముకుంటున్నానని, తమకు పోస్టింగ్ ఎప్పుడిస్తారని చంద్రబాబును ప్రశ్నించారు.
పోస్టింగ్ ఇవ్వకపోవడంతో తాను చేపలు అమ్ముకుంటూ బతుకు వెళ్లదీస్తున్నానని చెప్పాడు. దీంతో కంగుతున్న చంద్రబాబు ఆ యువకుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విశాఖపట్టణంలో ఆదివారం నాడు చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. తనిఖీలలో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నున్న చేపలా మార్కెట్కు వెళ్లారు. చేపలమ్ముకుంటున్న ఓ యువకుడితో మాట్లాడారు.
మీ సమస్యలు ఏమిటని చంద్రబాబు ఆ యువకుడిని ప్రశ్నించారు. ఆ యువకుడి పేరు త్రినాథ్. ముఖ్యమంత్రి అడగటంతో తన సమస్యను అతను చెప్పుకున్నాడు.
2014లో డీఎస్సీ క్వాలిఫై అయి 45 వ ర్యాంకు సాధించానని, ఇంత వరకూ పోస్టింగ్ ఇవ్వలేదని, జీవనోపాధి కోసం చేపలు అమ్ముకుంటున్నానని చెప్పాడు. తనకు ఉద్యోగం ఎప్పుడిస్తారని అతను చంద్రబాబుని ప్రశ్నించాడు. వారం రోజుల్లో డీఎస్సీ పోస్టింగ్ లిచ్చే ఏర్పాటు చేస్తున్నామని బాబు హామీ ఇచ్చారు.