యూట్యూబ్ లో చూసి ఆ శానిటైజర్ కంపెనీ ఏర్పాటు .. కురిచేడు శానిటైజర్ మరణాల కేసులో ట్విస్ట్
ఏపీలో కురిచేడు శానిటైజర్ మరణాల కేసులో ఆసక్తికర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి 16 మంది ప్రాణాలు విడిచిన ఘటనలో ఈ కేసుతో సంబంధం ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ కు సంబంధించిన పర్ఫెక్ట్ శానిటైజర్ కంపెనీ యజమాని శ్రీనివాస్ తో పాటు, వారికి ముడిసరుకు అందజేసిన ఇద్దరు మార్వాడి లను, హైదరాబాదులో ఈ కంపెనీకి డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న మరో ఇద్దరిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.
Recommended Video
కురిచేడు శానిటైజర్ మరణాల కేసులో ఆసక్తికర విషయాలు
శానిటైజర్ మరణాలకు బాధ్యులైన ఐదుగురిని హైదరాబాద్ నుండి కురిచేడు కి తీసుకు వచ్చారు. ఒకటి రెండు రోజుల్లో వారిని కోర్టు ముందు హాజరు పరిచారు అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ కేసును విచారణ చేస్తున్న పోలీసులకు ఆసక్తికర విషయాలు తెలిశాయి. యూట్యూబ్ లో చూసి శానిటైజర్ ని ఎలా తయారు చేయాలో నేర్చుకొని పర్ఫెక్ట్ శానిటైజర్ కంపెనీ ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
యూట్యూబ్ లో చూసి శానిటైజర్ కంపెనీ ఏర్పాటు
హైదరాబాదులోని జీడిమెట్ల ప్రాంతంలో ప్రస్తుత కరోనా నేపథ్యంలో, ప్రజల శానిటైజర్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని యూ ట్యూబ్ లో చూసి పర్ఫెక్ట్ శానిటైజర్ కమిటీని ఏర్పాటు చేశాడు శ్రీనివాస్. శ్రీనివాస్ నేపథ్యాన్ని చూస్తే అతను మూడో తరగతి వరకే చదివాడు. మొదట్లో కిరాణా షాపులో పని చేసిన శ్రీనివాస్ ఆ తర్వాత పర్ఫెక్ట్ కిరాణా మర్చంట్స్ పేరుతో గృహావసరాలకు తానే సొంతంగా షాప్ పెట్టాడు.
కురిచేడు శానిటైజర్ మరణాల కేసు దర్యాప్తులో నకిలీ కంపెనీ గుట్టు రట్టు
కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ తో శానిటైజర్ లు, మాస్కులు అమ్మకాలు చేయడం ప్రారంభించిన శ్రీనివాస్ వ్యాపారం బాగుందని ఏకంగా శానిటైజర్ కంపెనీని పెట్టేశాడు. ఇక శానిటైజర్ అమ్మకాలతో మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం సాగుతున్న సమయంలో కురిచేడు శానిటైజర్ మరణాల కేసు నకిలీ కంపెనీ గుట్టు రట్టు చేసింది .పర్ఫెక్ట్ శానిటైజర్ కంపెనీకి శానిటైజర్ తయారు చేయడానికి తయారీ అనుమతులు గాని, ల్యాబ్ టెక్నీషియన్లు కానీ లేవని గుర్తించిన పోలీసులు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు .
పర్ఫెక్ట్ శానిటైజర్ కంపెనీ యజమానితో పాటు మరో నలుగురు అరెస్ట్ .. విచారణ
శానిటైజర్ తయారీలో ఇథైల్ ఆల్కహాల్ తో పాటు ,మిథైల్ క్లోరైడ్ ను ఉపయోగించడంతో శానిటైజర్ తాగి 16 మంది మృత్యువాత పడ్డారు. కురిచేడు లో కొంతమంది మెడికల్ షాప్ ల వారికి పర్ఫెక్ట్ కంపెనీ శానిటైజర్ ను దర్శికి చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ తీసుకొచ్చి అమ్మినట్టు తెలిసింది. దీంతో అతని కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ప్రస్తుతం తమ ఆధీనంలో ఉన్న హైదరాబాద్ పర్ఫెక్ట్ కంపెనీ యజమాని శ్రీనివాస్ ను విచారణ చేస్తున్నారు.