మంత్రులపై వైఎస్ భారతి గుస్సా: లోకేష్ చేత చేయించాలని డిమాండ్
గుంటూరు/ కాకినాడ: తన భర్త, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దీక్షపై మంత్రులు కామినేని శ్రీనివాస రావు, పత్తిపాటి పుల్లారావు అనుమానాలు వ్యక్తం చేయడంపై వైయస్ భారతి మండిపడ్డారు తన భర్త ఆరోగ్య పరిస్థితిపై మంత్రులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఆమె సోమవారం దీక్షా ప్రాంగణం వద్ద మీడియాతో అన్నారు.
ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న తన భర్త వైయస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తుండడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. షుగర్ లెవెల్ కూడా 61కి వచ్చేసిందన, అది కనీసం 80 ఉంటేనే మంచిదని చెబుతున్నారని ఆమె అన్నారు. మంత్రులు వాళ్లేం చేస్తారో అది మాట్లాడితే మంచిది గానీ, పక్కవాళ్లను తప్పు పడితే ఎలా అని ఆమె అన్నారు. వైయస్ జగన్ ఆరు రోజులుగా ఏమీ తినడం లేదని, చాలా బాధగా ఉందని భారతి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సోమవారం ఆయన ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో చంద్రబాబు చేసినవి దొంగ దీక్షలని ఆయన వ్యాఖ్యానించారు.
అందుకే చంద్రబాబు అందరినీ దొంగ బుద్ధితో చూస్తున్నారని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు నిరాహార దీక్ష చేస్తే షుగర్, బిపి లెవెల్స్ ఎందుకు డౌన్ కాలేదని ఆయన అడిగారు. దమ్ముంటే నారా లోకేష్తో జగన్కు సమానంగా దీక్ష చేయించాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు.
కాగా, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు మాజీ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు నేత జివి హర్షకుమార్ మద్దతు ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. వైయస్ జగన్ దీక్ష తన స్వార్థం కోసం కాదని, ప్రత్యేక హోదా కోసమేనని ఆయన అన్నారు.