వైఎస్ జగన్ రికార్డ్: సీఎం కుమారుడు సీఎం కావడం..మరెవ్వరికీ సాధ్యం కాకపోవచ్చ!
అమరావతి: తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు వంటి నాయకుడిని ఢీ కొట్టి నిలవడం అంటే మాటలు కాదు. రాజకీయాల్లో 40 అనుభవం ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన వ్యూహాల ముందు ఎంతటి వారైనా దిగదుడుపే అని చెబుతుంటారు. ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించడం అనే ఏకైక లక్ష్యంతో పనిచేసే నిఖార్సయిన రాజకీయ నాయకుడు చంద్రబాబు అని పేరుంది. దేశ ప్రధాన మంత్రులను నిర్ధారించిన అనుభం చంద్రబాబుకు ఉంది. అలాంటి చంద్రబాబు నాయుడిని, ఆయన పార్టీని మట్టి కరిపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును పట్టుమని 45 సంవత్సరాల వయస్సు కూడా లేని వైఎస్ జగన్ ఓడించడం అద్భుతమే.
అలాంటి ఘనతను సొంతం చేసుకున్న వైఎస్ జగన్.. మరో మైలురాయిని కూడా అందుకున్నారు. సమీప భవిష్యత్తులో దీన్ని ఎవరూ అధిగమించలేరనే చెప్పుకోవచ్చు. అదే- ఓ ముఖ్యమంత్రి కుమారుడు ముఖ్యమంత్రి కావడం. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఓ తొలి అధ్యాయం ఇది.
పార్టీల్లో... ప్రజాశాంతీ పార్టీ వేరయా... కేఏ పాల్కు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా...?
రాష్ట్రానికి చాలామంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వారి కుమారులు కూడా రాజకీయాల్లో రాణించినప్పటికీ.. ముఖ్యమంత్రి పదవులను అధిష్ఠించిన దాఖలాలు లేవు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసునిగా 2009లోపూర్తిస్థాయి రాజకీయాల్లో ప్రవేశించారు వైఎస్ జగన్. కాంగ్రెస్లో చేరారు. కడప నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. తండ్రి మరణానంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల వల్ల కాంగ్రెస్కు గుడ్ బై చెప్పారు. తన తండ్రి పేరు కలిసి వచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. పార్టీని నెలకొల్పిన ఏడేళ్ల వ్యవధిలోనే అధికారంలోకి తీసుకుని రాగలిగారు.
ఎన్డీ రామారావుకు కుమారులు ఉన్నా..
రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఓ ప్రభంజనంగా చెప్పుకోవచ్చు. పార్టీని నెలకొల్పిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిందా పార్టీ. టీడీపీని నెలకొల్పి, రెండుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్టీ రామారావుకు కుమారులు ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రులు కాలేకపోయారు. రాజకీయాల్లోనూ వారి ప్రవేశం అంతంత మాత్రమే. దివంగత హరికృష్ణ అన్నా టీడీపీని నెలకొల్పినప్పటికీ.. నెగ్గుకుని రాలేకపోయారు. బావ చంద్రబాబు బలవంతంతో టీడీపీలో చేరి, ఆరునెలల పాటు మంత్రిగా పనిచేశారు. అసెంబ్లీకి ఎన్నిక కాలేకపోవడంతో అర్ధంతరంగా పదవి నుంచి తప్పుకొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు మనోహర్.. రాజకీయాల్లో రాణిస్తున్నారు. కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా గుర్తింపు పొందారు. ఇక ఆ తరువాత ఆ స్థాయిలో ఎవరూ రాలేకపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. శాసన మండలి ద్వారా ఎన్నికై, తండ్రి మంత్రివర్గంలో చోటు సంపాదించగలిగారు. తాజా ఎన్నికల్లో ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి అసెంబ్లీకి పోటి చేశారు. వెనుకంజలో ఉన్నారు.
ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చుకున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి నల్లారి అమర్నాథ్ రెడ్డి.. మంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయం అలాక్కాదు. అసాధారణ పోరాటం చేశారు. సోనియాగాంధీ వంటి శక్తిమంతురాలిని ఢీ కొట్టారు. ఆమెను కాదని పార్టీ నుంచి బయటికి వచ్చారు. జాతీయ స్థాయిలో సోనియా గాంధీ, రాష్ట్రస్థాయిలో చంద్రబాబు వంటి బలమైన నేతలతో పోరాటం సాగించారు. కేసులను ఎదుర్కొన్నారు. 16 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపారు. అయినప్పటికీ తన ధైర్యాన్ని కోల్పోలేదు.
2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ అయిదేళ్ల పాటూ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రత్యేక హోదా నినాదాన్ని సజీవంగా ఉంచారు. 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. తన విజయానికి తానే బాటలు వేసుకున్నారు. ఓ ముఖ్యమంత్రి కుమారుడిగా.. ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠించిన ఘనతను సాధించారు. ఇప్పట్లో ఈ ఘనతను ఎవరూ సాధించలేకపోవచ్చు.