ఒబామా 'మైక్రో టార్గెటింగ్ స్ట్రాటేజీ': జగన్కు పీకే సరికొత్త వ్యూహం, అసలేమిటి?
అమరావతి: 2014లో కచ్చితంగా గెలుస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు అత్యుత్సాహానికి పోయారనే విమర్శలు ఉన్నాయి. అయితే, 2014 నుంచి జగన్ పాఠాలు నేర్చుకుంటున్నారని అంటున్నారు. అతి విశ్వాసం కారణంగానే వైసీపీ గత ఎన్నికల్లో టీడీపీ చేతిలో తక్కువ స్థానాలతో ఓడిపోయింది.
చదవండి: సిగ్గుపడుతున్నామని రోజా
ఈ నేపథ్యంలో ఈసారి జగన్ మైక్రో టార్గెటింగ్ స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. మరోవైపు వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల కోసం వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఎలా ముందుకు వెళ్లాలో జగన్కు సూచనలు చేస్తున్నారు.
చదవండి: పూనమ్ కౌర్ ఎఫెక్టా... సారీ అడగట్లేదు: పవన్ ఫ్యాన్స్ 7 ప్రశ్నలకు మహేష్ కత్తి జవాబు
పూర్తి వివరాలు సేకరించిన ప్రశాంతి కిషోర్ 200 మంది టీం
ప్రశాంత్ కిషోర్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-పాక్)కు చెందిన 200 మంది టీమ్ ఇప్పటికే ఏపీలోని ఆయా ప్రాంతాలు, నియోజకవర్గాల వారీగా డాటాను సేకరించిందని తెలుస్తోంది. దాదాపు ఏడాదిగా ప్రశాంత్ కిషోర్ టీం అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ఎక్కడ ఏ పార్టీకి అనుకూలం, ఎక్కడ ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయాలకు చెందిన వివరాలను పూర్తిగా సేకరించింది.
ప్రశాంత్ కిషోర్ సూచన.. బరాక్ ఒబామా బాటలో
ప్రశాంత్ కిషోర్ సూచనలు, సలహాల మేరకు జగన్ ఏపీలోని ప్రతి గ్రూప్ అంటే.. వర్గం, ప్రాంతం, కులం, మతం పైన ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2012లో అధ్యక్ష ఎన్నికల్లో బరాక్ ఒబామా టీం ఏ వ్యూహాన్ని అయితే అనుసరించిందో 2019లో గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్ సూచనలతో జగన్ అదే విధంగా ముందుకు పోతున్నారని అంటున్నారు.
ఎన్నికల వ్యూహంలో భాగంగా
జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే. ఆరు నెలల పాటు 3000 కిలోమీటర్లు తిరగనున్నారు. 175 నియోజకవర్గాలకు గాను 125 నియోజకవర్గాలను ఆయన కవర్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇది కీలక పాదయాత్ర అని అంటున్నారు. ఇది కూడా 2019 ఎన్నికల వ్యూహంలో భాగమే.
అన్ని వర్గాలతో భేటీ
మైక్రో టార్గెటింగ్ స్ట్రాటజీ ప్రకారం.. తన పాదయాత్రలో జగన్ వివిధ వర్గాలతో భేటీ అవుతారు. అందులో కులాలు, మతాలే కాకుండా యువత, రైతులు, మహిళలు.. ఇలా అన్ని కమ్యూనిటీలు, సెక్షన్లకు తన పాదయాత్ర ద్వారా జగన్ దగ్గర కావాలనుకుంటున్నారు. ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు పూర్తయి, చిత్తూరు జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో ఆయన వివిధ వర్గాలతో అప్పుడప్పుడు భేటీ అవుతున్న విషయం తెలిసిందే.
స్ట్రాటెజీ ఇదీ మైక్రో టార్గెటింగ్ స్ట్రాటెజీ
జగన్ తన పాదయాత్రలో భాగంగా ఇప్పటికే బీసీలతో, రైతులతో, మహిళా సంఘాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారని అంటున్నారు. ఇలా ఆయా జిల్లాల్లో, ఆయా నియోజకవర్గాల్లో చిన్న చిన్న గ్రూపులకు దగ్గర కావడమే మైక్రో టార్గెటింగ్ స్ట్రాటజీ అని చెబుతున్నారు.
దీనిని క్యాష్ చేసుకునే ప్రయత్నం
ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి బీసీలు టీడీపీకి మద్దతుగా ఉన్నారని కూడా ప్రశాంత్ కిషోర్ సర్వేలో తేలింది. అయితే దీనిని తమ వైపు మళ్లించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. రైతులు, బీసీలు, మహిళల్లోని అసంతృప్తిని సాధనంగా ఉపయోగించుకొని ముందకు వెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. కాపులకు రిజర్వేషన్ల విషయంలో అటు కాపులు పూర్తి సంతృప్తిగా లేరు. ఇటు బీసీలు ఆగ్రహంతో ఉన్నారు. దీనిని క్యాష్ చేసుకోవాలని వైసీపీ చూస్తోందని తెలుస్తోంది.
మైక్రో టార్గెటింగ్ స్ట్రాటెజీ వ్యూహంలో భాగంగా
వ్యూహాల్లో భాగంగానే జగన్ తన పాదయాత్రలో కీలక హామీలు ఇస్తున్నారని, ప్రకటన చేస్తున్నారని అంటున్నారు. రైతులను తన వైపు తిప్పుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సురెన్స్ స్కీంలు, మహిళల కోసం నితీష్ కుమార్ దారిలో మద్యపాన నిషేధం.. ఇలా పలు ప్రకటనలు చేస్తున్నారని అంటున్నారు. మైక్రో టార్గెటింగ్ స్ట్రాటేజీలో భాగంగా ముస్లీం, క్రైస్తవ ప్రీస్ట్లకు వేతనాలు ఇస్తామని చెబుతున్నారని అంటున్నారు.
పాదయాత్ర లేని చోట ఇప్పటికే అమలు
జగన్ పాదయాత్ర లేని జిల్లాలు లేదా నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు కూడా మైక్రో టార్గెటింగ్ స్ట్రాటజీ ప్లాన్ అమలు చేస్తున్నారని అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ టీంలోని మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్, ఎకనామిస్ట్స్, సోషల్ సైంటిస్ట్స్, పొలిటికల్ సైంటిస్టులతో కలిసి జగన్ పాదయాత్ర చేయని జిల్లాల్లో ఇప్పటికే పలు గ్రూపులు, సంఘాలు, కమ్యూనిటీలతో భేటీలు జరుపుతున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుపై గెలుపు కోసం, పవన్ కళ్యాణ్ లేదా బీజేపీ ఎవరితో జతకలిసినా గెలుపే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ ఈ మైక్రో టార్గెటింగ్ స్ట్రాటేజీ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు.