రెండింట్లో ఏం జరిగినా వైసీపీదే గెలుపు!: పవన్ కళ్యాణ్ మీద జగన్ అంచనా ఏమంటే?
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీల మధ్య పోటా పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పై పార్టీలలోని ఏ రెండు కలిసి పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు.
2014లో టీడీపీకి మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ 2019లో లెఫ్ట్ పార్టీలు మినహా, ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా లేరు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కూడా పార్టీ గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇలాంటి సమయంలో జనసేనతో కలిసి క్రెడిట్ను పంచుకునే ఉద్దేశ్యం లేనట్లుగా ఉంది. ఎటూ టీడీపీ ఒక్కటే జనసేనతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తోంది. కానీ పవన్ అందుకు సిద్ధంగా లేరు.
అప్రమత్తమైన జనసేన.. హడావుడిగా పిలిపించి: జగన్-పవన్లతో భేటీపై అసలు అలీ ఏం చెప్పారు?
అలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం
2014లో పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు పలికారు. వైసీపీ ఒంటరిగా పోటీ చేసింది. ఇప్పుడు మూడు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రభావంపై జగన్ లెక్కలు వేసుకుంటున్నారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. పవన్ ఒంటరిగా పోటీ చేస్తే అది తమకే లాభిస్తుందని జగన్ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ను అభిమానించే వారు టీడీపీకి వేశారు. ఇప్పుడు వారే జనసేనకు వేయవచ్చు. అప్పుడు టీడీపీకి ఓటు బ్యాంక్ తగ్గుతుందని, అది వైసీపీకి లాభమేనని అంటున్నారు.
పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసినా
ఒకవేళ పరిస్థితులు మారి టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేసినా అది తనకు వచ్చే నష్టం లేదని జగన్ భావిస్తున్నారట. చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం తనకే వస్తుందని చెబుతున్నారట. టీడీపీకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రానంత వ్యతిరేకత ఉందని చెబుతున్నారు.
రెండిట్లో ఏది జరిగినా గెలుపు మాదే
పవన్ కళ్యాణ్ తనతో వస్తారని అనుకోవడం లేదని, ఎందుకంటే తాము ఎప్పుడు మాట్లాడింది లేదని జగన్ చెబుతున్నారు. పవన్ ఒంటరిగా పోటీ చేసినా, టీడీపీతో కలిసి పోటీ చేసినా తమకు వచ్చే నష్టం లేదని అంటున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంత చీలుతుందని, కానీ, గతంలో తమకు పడిన ఓట్లకు ఇది అదనం అంటున్నారు. కలిసి పోటీ చేస్తే చంద్రబాబుపై వ్యతిరేకతతో తమకు పట్టం కడతారని అంటున్నారు.
కలిసి పోటీ చేస్తే సంతోషిస్తా
పవన్ కళ్యాణ్, చంద్రబాబులు కలిసి పోటీ చేస్తే ఇంకా సంతోషిస్తానని జగన్ చెప్పారు. వారు 2014లో కలిసి పోటీ చేసి ప్రజలను మోసగించారని, ఇప్పుడు విడిపోయినట్లుగా నటించి మోసం చేస్తున్నారన్నారు. ఈసారి ప్రజా వ్యతిరేకతతో చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమని చెబుతున్నారు.