అశోక్ గజపతి మాట్లాడలేదు, నా భార్యపై అక్రమ కేసులు పెట్టాలని: తొలి అభ్యర్థిని ప్రకటించిన జగన్
విజయనగరం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి 2019 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ తరఫున అధికారికంగా తొలి అభ్యర్థిని ప్రకటించారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి పోటీ చేస్తారని ఆయన తెలిపారు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. విజయనగరం జిల్లాలో నీటి ప్రాజెక్టులు పడకేశాయన్నారు. బీమ్సింగ్ చక్కెర కర్మాగారం నష్టాల్లో కూరుకుపోయిందని, ఆ కర్మాగార ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని వాపోయారు. విజయనగరం విషజ్వరాల జిల్లాగా మారిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేని జిల్లా కూడా ఇదే అన్నారు.
అవన్నీ ఏమయ్యాయి?
బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు జత కట్టాయని తమ పైన దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు విజయనగరం జిల్లాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీ, ఫుడ్ పార్క్, లలితకళల కాలేజీలు ఎక్కడ అన్నారు.
అశోక్ గజపతి రాజు మాట్లాడలేదని ఆగ్రహం
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేని ఏకైక జిల్లా కేంద్రం విజయనగరమేనని జగన్ అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర చంద్రబాబు బినామీలకు భూములు ఇచ్చారని ఆరోపించారు. లంచాల కోసమే భోగాపురం ఎయిర్ పోర్ట్ టెండర్లు రద్దు చేశారన్నారు. గిరిజన యూనివర్శిటి, రైల్వేజోన్, ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో అశోక గజపతిరాజు మాట్లాడిన దాఖలాలు లేవన్నారు.
అందుకే ఓటుకు నోటులో చంద్రబాబు అరెస్ట్ కాలేదు
బీజేపీతో కుమ్మక్కు వల్లే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అరెస్ట్ కాలేదని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రత్యేక హోదా కోసం తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు. తన కుటుంబ సభ్యులను కేసుల్లో ఇరికిస్తున్నారని దుమ్మెత్తి పోశారు. ఆసియాలోనే మొదటి రబ్బరు డ్యాంను నిర్మించిన ఘనత వైయస్ రాజశేఖర రెడ్డిదే అన్నారు.
నాపై, నా భార్యపై అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నం
అశోక్ గజపతిరాజు కేంద్రమంత్రిగా ఉండి కూడా గిరిజన యూనివర్సిటీగానీ, రైల్వే జోన్ గానీ తీసుకు రాలేకపోయారని జగన్ అన్నారు. టీడీపీ ప్రభుత్వం కేంద్రం వద్ద అన్నింటిని తాకట్టు పెట్టిందన్నారు. హోదా విషయంలో కూడా చంద్రబాబు బీజేపీతో రాజీ పడ్డారని, గతంలో జైట్లీ ప్యాకేజీ ఇస్తామని ప్రకటించిన వెంటనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వారికి సన్మానాలు చేశారన్నారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో చేతులు కలిపి తనపై అక్రమంగా కేసుల పెట్టించారన్నారు. ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపి నాపై, తన భార్య పై అక్రమ కేసుల పెట్టాలని చూస్తున్నారన్నారు. ఎన్నికల్లో సానుభూతి పొందాలని బాబ్లీ కేసును చంద్రబాబు తెరమీదకు తీసుకువచ్చారని, ఇలాంటి అనైతిక పొత్తులు పెట్టుకునే చంద్రబాబు పాలనకు రానున్న ఎన్నికల్లో చరమగీతం పాడాలన్నారు.