దేశ చరిత్రలో లేనివిధంగా ‘విద్య’: ప్రత్యేక పథకాలు ప్రకటించిన సీఎం జగన్, వరాలే
అమరావతి: ఎస్సీల కోసం మూడు కార్పొరేషన్లు, ఎస్సీ, ఎస్టీ కమిషన్లు ఏర్పాటు చేసింది తమ ప్రభుత్వమేనని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు దళిత వ్యతిరేకులుగా మారారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో కూడా ఎస్సీలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చామని తెలిపారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకంపై చర్చ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడారు.
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా..
మన రాష్ట్రంలో అక్షరాస్యత తక్కువగా ఉండటంతోనే తమ ప్రభుత్వం విద్యపై ప్రాముఖ్యత ఇస్తోందని సీఎం తెలిపారు. చదువులు ఆపేసేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉందని అందుకే నూతన పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. అమ్మఒడి కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. పేదలకు మెరుగైన విద్యను అందించడమే అమ్మఒడి లక్ష్యమని అన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని కార్యక్రమం అమ్మఒడి అన్నారు. 82 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును మార్చేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని వివిరంచారు. జనవరి 9న తన పాదయాత్ర ముగిసిన రోజున ఈ గొప్ప కార్యక్రమం ప్రారంభించడం సంతోషకరమిన అన్నారు. ఒమ్మఒడి పథకం ద్వారా ఒకేసారి తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ. 6,028 కోట్లు పంపించామని తెలిపారు. ఈ మొత్తం అందని వారికి కూడా త్వరలోనే అందిస్తామని చెప్పారు.
మధ్యాహ్న భోజనంలో రోజుకో స్పెషల్..
మధ్యాహ్న భోజన పథకంలో కూడా మార్పులు తీసుకువచ్చామని సీఎం జగన్ చెప్పారు. పిల్లలకు ప్రతీరోజు ఒకేరకమైన భోజనం కాకుండా రుచికరమైన, నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. ‘ప్రతీ సోమవారం సోమవారం- అన్నం, పప్పుచారు, గుడ్డుకూర, స్వీటు, చిక్కీ.. మంగళవారం- పులిహోర, టొమాటో పప్పు, ఉడికించిన గుడ్డు... మళ్లీ బుధవారం- వెజిటబుల్ రైస్, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ... గురువారం కిచిడీ, టొమాటో చట్నీ, ఉడికించిన గుడ్డు.. శుక్రవారం- అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ... శనివారం- అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్ ఉండేలా మెనూ రూపొందించాం. ‘గోరుముద్ద' పేరిట విద్యార్థులకు భోజనం అందజేస్తాం. అంతేగాక, పథకం సాఫీగా అమలు జరిగేలా... ఆయాల జీతం రూ. 1000 నుంచి రూ. 3 వేలకు పెంచాం. దీని వల్ల దాదాపు రూ. 344 కోట్ల భారం పడుతుంది' అని సీఎం జగన్ వివరించారు. మధ్యాహ్న భోజనం పథకం పనితీరును పర్యవేక్షించేందుకు నాలుగు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ప్రపంచంతో పోటీపడేందుకు ఇంగ్లీష్ మీడియం..
ప్రస్తుతం ప్రపంచంతో పోటీపడే విధంగా ఇంగ్లీష్ మీడియంతో పిల్లల చదువులు మారతాయని అన్నారు. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు. ఆ తర్వాత సంవత్సరానికి తరగతి చొప్పున ఇంగ్లీష్ మీడియంను పెంచుతామని చెప్పారు. ఇంగ్లీష్ మీడియంపై విద్యార్థులు, టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని జగన్ చెప్పారు. సింగపూర్, చికాగో, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ విద్యా సంస్థల నుంచి అవసరమైన సహాయ సహకారాలు తీసుకుంటామన్నారు. తెలుగు సబ్జెక్ట్ కంపల్సరీ చేస్తున్నామని తెలిపారు. నాడు-నేడు అనే పథకాన్ని కూడా తీసుకొస్తున్నామని చెప్పారు. స్కూల్స్, కాలేజీల మార్పులు చేస్తామన్నారు.
ప్రతీ విద్యార్థికి కిట్..
విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రతీ విద్యార్థికి ఓ కిట్ అందజేస్తామని సీఎం జగన్ తెలిపారు. ఈ కిట్లో స్కూలు బ్యాగ్, మూడు జతల యూనిఫాంలు (బట్ట ఇచ్చి కుట్టుకూలీ కూడా ఇస్తామని చెప్పారు), పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బూట్లు, రెండు జతల సాక్సులు, ఒక బెల్టు ఉంటాయని సీఎం జగన్ వివరించారు. ఈ కిట్ను కానుకగా అందజేస్తామని చెప్పారు. ఈ కిట్ విలువ రూ. 1350 ఉంటుందని చెప్పారు. వసతి దీవన, విద్యా దీవెన పథకం కింద హాస్టల్లో ఉండే విద్యార్థుల తల్లికి ఏడాదికి రెండు దఫాల్లో రూ. 20వేలు అందిస్తామని వివరించారు. పూర్తి ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తామని సీఎం జగన్ తెలిపారు. ప్రజలకు మంచి చేయాలనే తమ పథకాలని చెప్పారు.