సీబీఐ కోర్టుకు జగన్: ఎక్కడున్నారో చెప్పుకొండంటూ లోకేష్ సెటైర్లు వేశారు!
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ, ఈడీ దాఖలు చేసిన అభియోగపత్రాలపై విచారణ జరిగింది.
ఈ కేసుకు సంబంధించి ప్రతి శుక్రవారం కోర్టుకు జగన్ హాజరవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జగన్ పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. కేసు విచారణ కోసం పాదయాత్రకు ఆయన ఒక్కరోజు విరామం ప్రకటించారు.
మరోపక్క, ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిలు కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ కేసు తదుపరి విచారణను జూన్ 30వ తేదీకి వాయిదా వేశారు.
Friday today. Where can we find our opposition leader? Choose among the following: 1) Nampally Court 2) Lotus Pond Mahal 3) Bengaluru Mahal
— Lokesh Nara (@naralokesh) June 8, 2018
ఇది ఇలా ఉండగా, వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శుక్రవారం లోకేశ్ ట్వీట్ చేస్తూ... 'ఈరోజు శుక్రవారమని.. మన ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎక్కడ ఉంటారో చెప్పుకోండి' అని ప్రశ్నించారు. అందుకోసం మూడు ఆప్షన్లు ఇచ్చారు. ఈ కింది వాటిలో ఏదైనా ఒకటి ఎంచుకోండి అంటూ 1. నాంపల్లి కోర్టు... 2. లోటస్ పాండ్ మహల్.. 3. బెంగళూరు మహల్ అని పేర్కొన్నారు.