రెండో డ్రైవర్ మాటేమిటి: బస్సు ప్రమాదంపై జగన్, టిడిపి నేతల బస్సు కాబట్టే..
రోడ్డు ప్రమాదానికి కారకులైన నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, డ్రైవర్ మృతికి పోస్టుమార్టం ఎందుకు చేయలేదని వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రశ్నించారు.
విజయవాడ: రోడ్డు ప్రమాదానికి కారకులైన నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, డ్రైవర్ మృతికి పోస్టుమార్టం ఎందుకు చేయలేదని వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రశ్నించారు.
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం మూలపాడు వద్ద నేషనల్ హైవేపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదకొండు మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జగన్ పరామర్శించారు.
'గో బ్యాక్ జగన్': చేదు అనుభవం, జగన్ ఉన్న గదికి దూసుకెళ్లారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాధితులకు రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ మృత దేహానికి ఇప్పటి వరకు ఎందుకు పోస్టుమార్టం చేయలేదని నిలదీశారు. నిందితులను ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
టూరిస్టు బస్సును స్టేజీ క్యారియర్గా నడపడంపై కేసు పెట్టాలని సూచించారు. రెండో డ్రైవర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రెండో డ్రైవర్ గురించి చెప్పాలని అభిప్రాయపడ్డారు. అతను పారిపోయాడా అని నిలదీశారు. అలాగే, రిపోర్టు తారుమారు చేస్తున్నారని డాక్టర్లతో జగన్ వాగ్వాదం పెట్టుకున్నారు.
అంతకుముందు, వైసిపి నేత పార్థసారథి మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం పైన కేసు పెట్టాలన్నారు.
వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టిడిపి నేతల బస్సు కాబట్టి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తోందన్నారు.
చనిపోయిన వారిని ఆదుకోవాలన్న కనీస ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదన్నారు. చంద్రన్న బీమాతో చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రన్న బీమా ఉన్న వారికి ఒకలా, లేని వారికి మరొకలా పరిహారం ప్రకటించడం సమంజసం కాదన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వేరే రాష్ట్రాల వారికి తక్కువ పరిహారం ప్రకటించడాన్ని తప్పుబట్టారు.
నందిగామ ఆసుపత్రి నుంచి హడావుడిగా మృతదేహాలను ఎందుకు తరలిస్తున్నారన్నారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న రెండో డ్రైవర్ పారిపోయాడని చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. రెండో డ్రైవర్ పారిపోయాడా, తప్పించారా అని నిలదీసారు. రెండో డ్రైవర్ను కనీసం ప్రశ్నించరా అని అడిగారు.