సూటిగా.. అవునా కాదా చెప్పండి, ఈనాడు పేపర్లోదే: జగన్
హైదరాబాద్: విశాఖలో వచ్చిన హుధుద్ తుఫాను పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వానికి పలు సూటి ప్రశ్నలు వేశారు. ఆయన శుక్రవారం శాసన సభలో మాట్లాడారు. తాను ప్రభుత్వాన్ని సూటి ప్రశ్నలు అడుగుతున్నానని పదేపదే చెబుతూ పలు ప్రశ్నలు అడిగారు. ప్రశ్న ప్రశ్నకు ఆయన సూటి ప్రశ్న అడుగుతున్నా అంటూ చెప్పారు. నేను అడిగేవి వాస్తవం అవునా, కాదా చెప్పండి అంతే అన్నారు.
ఈ రోజు హుధుద్ తుఫాను పైన చర్చ జరుగుతుంటే సీఎం చంద్రబాబు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ వచ్చారని విశాఖ వెళ్లారని, కానీ అది ఎప్పుడో ఖరారైందని, అలాంటప్పుడు శాసన సభ సమావేశాల తేదీలను ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. కేంద్రాన్ని శాసన సభ సాయం అడగాలని తీర్మానం చేయాలన్నప్పుడు చంద్రబాబు ఎక్కడికో ఎందుకు వెళ్లారన్నారు.
మంత్రి గంటా శ్రీనివాస రావు చంద్రబాబు గురించి, ప్రభుత్వం గురించి చాలా గొప్పగా చెప్పారని, తుఫాను వచ్చినప్పుడు తాను పది రోజులు పర్యటించానని చెప్పారు. కానీ సొంత నియోజకవర్గంలో పర్యటన కూడా చేయని మంత్రి ఎవరైనా ఉన్నారా అంటే గంటా ఒక్కరే వచ్చిందన్నారు. అదేమిటని తాను అడిగితే జ్వరం వచ్చిందని చెప్పారన్నారు.
హుధుద్ తుఫాను వల్ల డెబ్బైవేల కోట్ల నష్టమో, ఇంకేంతోనని ఈనాడు పత్రికలో వచ్చిందని, ఇలా నష్టం వేల కోట్లలో ఉంటే ప్రభుత్వం వన్ పర్సెంట్ మాత్రమే ఖర్చు పెట్టిందని, ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఎందుకన్నారు.
చంద్రబాబు విశాఖలో తిరిగారని చెబుతున్నారని, కానీ పదివేల ఫైబర్ బోట్లు ఉత్తరాంధ్రలో కనబడకుండాపోయాయని, 400 సోలార్ బోట్లు కనిపించలేదని, వాటికి ఈ ప్రభుత్వం రూపాయి అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు.
తుఫాను వల్ల 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, మూడు వేల కోట్ల నష్టం జరిగిందని, దమ్మిడి అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. రైతుల క్రాఫ్ కరెన్సీకు పూచి ఎవరని ప్రశ్నించారు. మత్సకారులకు ఏమి ఇచ్చారని చెప్పారు. తాను ఈనాడులో వచ్చిన దానినే నేను చూపిస్తున్నానని, మీరు ఖర్చు పెట్టింది మాత్రం వన్ పర్సెంట్ మాత్రమే ఉందన్నారు.
అంతకుముందు వైసీపీ ఎమ్మెల్యే ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. హుధుద్ తుఫాను పైన వాతావరణ శాఖ అప్రమత్తం చేసినప్పటికీ చంద్రబాబు టీవీలకే అతుక్కుపోయారని, విశాఖకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఒడిశాలో ముందస్తు చర్యలు తీసుకున్నారని చెప్పారు.
రైతులకు ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదన్నారు. ఒడిశాలో ముందుగానే విద్యుత్ లైన్లు కట్ చేశారని చెప్పారు. అలాగే ఆహారం సరఫరా చేశారన్నారు. హుధుద్ తుఫాను నేపథ్యంలో చంద్రబాబు విశాఖకు వచ్చారు తప్ప గ్రామాల్లోకి రాలేదన్నారు.