నాకున్న వ్యామోహం అదొక్కటే, జిత్తులమారి బాబుతో పాటు వారిపై యుద్ధం: జగన్
ఇచ్చాపురం: తనకు డబ్బు పైన ఎలాంటి వ్యామోహం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్ర ముగిసిన అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడారు.
జగన్ పాదయాత్ర: ఇచ్ఛాపురంలోని వైసీపీ పైలాన్ అద్భుతం, ఎలా ఉందంటే?
నాకు ఉన్న వ్యామోహం అదొక్కటే
తనకు డబ్బుపై వ్యామోహం లేదని, తనకు ప్రేమ, వ్యామోహం ఉన్నది ఒక్కటేనని, అదేమిటంటే ఓసారి అధికారంలోకి వస్తే ముప్పై ఏళ్లు ప్రజల కోసం మంచిగా పని చేయాలనేది తన ఆశ అని జగన్ చెప్పారు. ముప్పై ఏళ్ల తర్వాత తాను చనిపోతే ప్రతి ఇంట్లో తన ఫోటో ఉండాలనేది తన ఆశ అన్నారు. ప్రతి గ్రామంలో నవరత్నాలకు సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టాలని జగన్ సూచించారు. ఇప్పటికే చాలాసేపు మాట్లాడానని, కాబట్టి ఇంకా మాట్లాడటం కష్టంగా ఉందని, చిట్టచివరగా ఒక్క మాట చెబుతున్నానని, 3600 కిలోమీటర్లు నడిచి ప్రతి పేదవాడి కష్టాన్ని చూశానని, వారి పరిస్థితి ఎలా మెరుగుపర్చాలనే ఆలోచిస్తున్నానని చెప్పారు.
మీ బిడ్డను ఆశీర్వదించండి
నేను 14 నెలలు పేదవాడితో ఉన్నానని, వారి కష్టాలు విన్నానని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి సమస్యపై తనకు అవగాహన ఉందని చెప్పారు. ప్రతి పేదవాడికి మంచి చేయాలనే తపన ఉందన్నారు. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మారుద్దామని పిలుపునిచ్చారు. తనతో కలిసి రావాలని కోరారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగుపర్చేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించాలని కోరుతున్నానని చెప్పారు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.
ఎన్నికలకు మూడు నెలలే, జిత్తుమారి చంద్రబాబుకు పోత్తు, మీడియా
సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నెలల కాలం మాత్రమే ఉందని జగన్ చెప్పారు. ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక చంద్రబాబు ప్రభుత్వాన్ని సాగనంపాలని చెప్పారు. ప్రతి ఒక్కరు సహకరించాలని, తనకు తోడుగా రావాలని కోరారు. జరిగే ఈ యుద్ధం ఒక్క చంద్రబాబు నాయుడి వంటి నారా రాక్షసుడితో మాత్రమే కాదని, ఈ నారాసురుడికి, ఈ చంద్రబాబుకు తోడుగా ఎల్లో మీడియా ఉందని చెప్పారు. వ్యవస్థలను మేనేజ్ చేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు పత్రికలు, చంద్రబాబుకు తోడుగా ఉన్న అనేక ఛానళ్లతోను యుద్ధం చేస్తున్నానని చెప్పారు. జిత్తులమారి చంద్రబాబు అనేక పొత్తులు పెట్టుకుంటారని జగన్ విమర్శించారు. తోడుగా ఉండమని, ఆశీర్వదించమని ప్రతి ఒక్కరినీ కోరుతున్నానని చెప్పారు.