సాక్షులతో ఇరికించారు, అంతా వైయస్ కేబినెట్దే!: జగన్ కేసుపై శ్రీలక్ష్మి
హైదరాబాద్: వైసిపి అద్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కొందరు సాక్షులు ప్రాథమికంగా ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా దాల్మియా అంశంలో సిబిఐ తనను నిందితురాలిగా చేర్చిందని ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి హైకోర్టుకు బుధవారం నివేదించారు.
వారి వాంగ్మూలాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలను చూపలేదన్నారు. కేబినెట్ నిర్ణయాలను తాము అమలు చేశామని, అది విధి నిర్వహణలో భాగమన్నారు. దాల్మియా కేసులో తన పైన అభియోగాలను విచారణ నిమిత్తం సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకోవడాన్ని ఆమె హైకోర్టులో సవాల్ చేశారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు బాధ్యత కలిగిన అధికారిగా వ్యవహరించానని, సీబీఐ తనపై తప్పుడు అభియోగాలతో నమోదు చేసిన కేసు కొట్టేయాలని శ్రీలక్ష్మి హైకోర్టును అభ్యర్థించారు.
కడప జిల్లాలో ఓ సంస్థకు కేటాయించిన గనులను దాల్మియా సిమెంట్స్కు బదలాయింపునకు శ్రీలక్ష్మి అనుకూలంగా వ్యవహరించి ఆయాచిత లబ్ధి చేకూర్చారని సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తన తప్పిదం ఎంతమాత్రం లేదని శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పైన జరిగిన విచారణ సందర్భంగా ఆమె తరఫు న్యాయవాది ఆసక్తికర వాదన చేశారు. అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తన క్లయింట్ బాధ్యత గల అధికారిగా మాత్రమే అమలు చేశారన్నారు. ఇందులో శ్రీలక్ష్మి సొంత నిర్ణయాలేమీ లేవన్నారు.
ఈ వ్యవహారంలో మైనింగ్ చట్టంలోని నిబంధనలను శ్రీలక్ష్మి ఉల్లంఘించారన్న సీబీఐ వాదనలో వాస్తవం లేదన్నారు. ప్రాసిక్యూషన్కు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయలేదన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉండగా, జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా జగతిలో టిఆర్ కన్నన్, మాదవ రామచంద్రన్, ఎకె దండమూడిలు పెట్టిన రూ.34.66 కోట్ల పెట్టుబడికి సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసు విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా పడింది.