కోడి కత్తి కేసులోకి చంద్రబాబును లాగుతారా? అక్రమాస్తుల కేసులో జగన్కు ఉపశమనం లభిస్తుందా?
అమరావతి: భారతీయ జనతా పార్టీపై ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. కేంద్రంలోని బీజేపీ నేతలు పని చేయరని, పని చేయమంటే కేసులు పెట్టి బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆదివారం ఆరోపించారు. దేశంలో దుష్ట రాజకీయాలు పెంచి పోషిస్తున్నారన్నారు. అఖిలేష్ యాదవ్, మాయావతి పొత్తు పెట్టుకున్న మరుసటి రోజే వారిపై సీబీఐ కేసు పెట్టారని, బీఎస్పీ, ఎస్పీ నేతలపై దాడులు చేయిస్తున్నారన్నారు.
బీజేపీ పద్ధతి లేని రాజకీయాలు చేస్తోందన్నారు. ఏపీకి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. మన హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. అదే సమయంలో వైసీపీ అధినేత జగన్పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి ఘటన కేసు ఎన్ఐఏకు అప్పగింత, హైకోర్టు విభజన-జగన్ ఆస్తుల కేసు మళ్లీ మొదటికి రావడంపై టీడీపీ నేతలు... బీజేపీని టార్గెట్ చేశారు.
ఊహించని ట్విస్ట్: మొదటికొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసు! చంద్రబాబు చెప్పిందే జరిగింది
కోడి కత్తి, జగన్ ఆస్తుల కేసులపై కుట్ర
ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ ఏపీలో కుట్ర రాజకీయాలకు తెరలేపారని మంత్రి నక్కా ఆనంద్ బాబు అనంతపురంలో అన్నారు. కోడి కత్తి కేసును ఎన్ఐఏకు అప్పగించడం కుట్రలో భాగమే అన్నారు. జగన్ కేసును నీరుగార్చేందుకే హైకోర్టును విభజించారని ఆరోపించారు. ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ హత్యకు తాము కుట్రలు పన్నామని ఆరోపణలు చేస్తున్నారని, కానీ కన్నా జీవితం మొత్తం హత్యలు, కుట్రలే అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ తన భాషను మార్చుకోవాలని ఆనంద్ బాబు హితవు పలికారు. కేసుల మాఫీ కోసమే విజయసాయి రెడ్డి ప్రధాని కాళ్ల చుట్టూ తిరుగుతున్నారన్నారు.
కేసుల నుంచి ఉపశమనం కోసమే బీజేపీతో దోస్తీ
దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కర్నూలులో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఏపీ సర్కారు రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తే కేంద్రం రూ.6వేల కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలనే అమలు చేయమని తాము అడుగుతున్నామని చెప్పారు. బీజేపీయేతర కూటమిని దెబ్బతీయాలని కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఓట్లు చీల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసుల నుంచి ఉపశమనం కోసమే జగన్ బీజేపీతో దోస్తీ కడుతున్నారన్నారు. మోడీ కేడీ ఆలోచనలకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. మోడీని ప్రధాని పదవి నుంచి దింపడమే తమ ధ్యేయమని చెప్పారు. ఇందుకోసం చంద్రబాబు మహాకూటమి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పార్లమెంటులో ఏపీ హక్కులు, విభజన హామీల కోసం ఆందోళన చేస్తున్న ఎంపీలను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. మోడీ గుజరాత్ పీఎంగా వ్యవహరిస్తున్నారన్నారు.
ఎన్ఐఏకు ఎలా అప్పగిస్తారు?
జగన్ను అడ్డంపెట్టుకొని ఏపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కోడికత్తి కేసును ఎన్ఐఏకు కేంద్రం ఎలా అప్పగించిందని ప్రశ్నించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగినా, జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్లో మాత్రమే ఎన్ఐఏకు బదిలీ చేస్తారని, కోడికత్తి కేసు అలాంటిది కాదన్నారు. జగన్పై 11 కేసుల్లో ఛార్జిషీట్ దాఖలు చేస్తే అందులో ఇప్పటి వరకు మూడు కేసులు విచారణకు వచ్చాయని, మిగిలిన కేసుల్లో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తోందన్నారు. రాజకీయ నాయకులు, ఆర్థిక నేరగాళ్లపై ఎలాంటి కేసులున్నా వాటిని ఏడాది లోపు పరిష్కరించాలని సుప్రీం కోర్టు తీర్పిచ్చినా కేంద్రం దాన్నికూడా పట్టించుకోవటం లేదన్నారు.
జగన్కు సానుభూతి కోసమే
జగన్పై కత్తి దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడం ఒక రాజకీయ కుట్ర అని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. దాడితో జగన్కు ఏపీలో సానుభూతి రావాలని, తద్వారా ఎన్నికల్లో లబ్ధి చేకూరాలనే ప్రణాళికతో దాడి ఘటన జరిగిందన్నారు. దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు, అతని కుటుంబ సభ్యులు తాము జగన్ అభిమానులమని చెప్పారని, నిందితుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఇదే విషయాన్ని తెలిపాడన్నారు.
చంద్రబాబుపైకి నెట్టే కుట్ర
జగన్ పైన దాడి కేసును చంద్రబాబుపై నెట్టేందుకు కుట్ర జరుగుతోందని, ఇందులో భాగంగానే కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రధాని మోడీ ఏపీ ప్రభుత్వంపై కక్ష కట్టి చంద్రబాబుకు చెడ్డపేరు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇదిలా ఉండగా, ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇందుకోసం డీజీపీ, ఏజీలతో చంద్రబాబు శనివారం సమావేశమయ్యారు.