జగన్పై దాడి కేసు విచారణ వాయిదా: వైసీపీ నేతలకి నోటీసులు, 'అతను లోన్లు ఎలా చెల్లిస్తున్నాడు?'
అమరావతి/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసును స్వతంత్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ జరిపించాలని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ పైన విచారణను న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది.
'కత్తి తీసుకెళ్లిన వ్యక్తి బొత్స బంధువే, జగన్ కథ అడ్డం తిరిగింది, రోజా డైరెక్షన్లో మరోసారి ప్రయత్నం'
మరోవైపు, దాడి కేసును ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) విచారిస్తోంది. నిందితుడు శ్రీనివాసును అధికారులు విచారిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే లేఖ రాసి సహకరించిన రేవతిపతి, విజయదుర్గలను కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే వైసీపీ మాత్రం స్వతంత్ర దర్యాఫ్తు బృందంతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
శ్రీనివాస రావు బ్యాంక్ అకౌంట్స్, ఫోన్ కాల్స్పై అధికారుల దృష్టి
శ్రీనివాస రావు బ్యాంక్ ఖాతాలు, ఫోన్ కాల్స్ పైన సిట్ అధికారులు దృష్టి సారించారు. పోలీసులు నిఘా కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడి ప్రవర్తనను పరిశీలిస్తున్నారు. నిందితుడికి చెందిన మూడు బ్యాంకు ఖాతాలను సిట్ బృందం పరిశీలిస్తోంది. అందులో ఉన్న నగదు, అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోనున్నారు.
దాడి సమయంలో ఉన్న నేతలకు సిట్ నోటీసులు
జగన్ పైన దాడి సమయంలో ఉన్న రాజకీయ నాయకులకు కూడా ప్రత్యేక దర్యాఫ్తు బృందం అధికారులు నోటీసులు జారీ చేశారు. వాంగ్మూలం కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చేందుకు జగన్ నిరాకరించిన విషయం తెలిసిందే. కానీ జగన్ అధికారులతో చెప్పిన వివరాలను రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. జగన్ అభిప్రాయాన్ని రిమాండులో పేర్కొన్నట్లు సీపీ లడ్డా తెలిపారు.
భూమి కొనుగోలు చేస్తానని!!
మరోవైపు, శ్రీనివాస రావు సోదరుడు సుబ్బరాజును ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో ఆదివారం నాడు మూడో రోజు విచారించారు. గ్రామంలో ఇటీవల కొంతమందికి శ్రీనివాస రావు పార్టీ ఇచ్చాడని, వారితో మాట్లాడుతూ భూమిని కొంటానని చెప్పాడని చెప్పాడని విచారణలో వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఈ చర్చ పైన పోలీసులు ఆరా తీస్తున్నారని సమాచారం.
ఆ లోన్లు ఎలా చెల్లిస్తున్నాడు?
పోలీసులు శ్రీనివాస రావు బ్యాంకు అకౌంట్లతో పాటు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాథాలను కూడా తనిఖీలు చేయనున్నారని తెలుస్తోంది. శ్రీనివాస రావు పేరు మీద రూ.2 లక్షల ఎల్ఐసీ ఉంది. ఆరు నెలలకు ఓసారి రూ.5500 చెల్లిస్తున్నాడు. ఇటీవల రూ.4 లక్షల రుణం తీసుకున్నాడు. వాటికి రూ.11వేలకు పైగా చెల్లిస్తున్నాడు. ఈ రుణాలు ఎలా చెల్లిస్తున్నాడో పోలీసులు తెలుసుకోనున్నారు.
నకిలీ సభ్యత్వ కార్డులపై ఫిర్యాదు
ఇదిలా ఉండగా, శ్రీనివాస రావుకు టీడీపీ సభ్యత్వం ఉన్నట్లుగా, గుర్తింపు కార్డు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే శ్రీనివాస రావు పేరుతో ప్రచారం జరుగుతోన్న గుర్తింపు కార్డులు అతనివి కావని టీడీపీ నేతలు తేల్చి చెప్పారు. శ్రీనివాస రావు నెంబర్ సభ్యత్వంపై గుంటూరుకు చెందిన టీడీపీ కార్యకర్త సభ్యత్వం ఉందని చెబుతున్నారు. కాబట్టి శ్రీనివాస రావు టీడీపీ సభ్యత్వం కార్డు అసలుది కాదని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. అవి నకిలీ సభ్యత్వ కార్డులు అని చెబుతూ టీడీపీ నేత వర్ల రామయ్య గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.