టిడిపిలోకి ఎమ్మెల్యేలు: కోర్టులోనైనా.. తెరపైకి జగన్ కొత్త వాదన
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కోర్టు బాట పట్టనున్నారు. వైసిపికి చెందిన పదమూడు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. బుధవారం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్తో కలిపి 13 మంది సైకిల్ ఎక్కారు.
ఎమ్మెల్యేలు పార్టీ మారటం పైన వైసిపి అధినేత జగన్ ఢిల్లీలో జాతీయస్థాయి నేతలకు ఫిర్యాదు చేశారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవినీతి పైన ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల చేరికల నేపథ్యంలో జగన్ ఒకింత ఒత్తిడిలో, ఆత్మరక్షణలో ఉన్నారని చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలో ఆయన బుధవారం సాయంత్రం మాట్లాడారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశానికి సంబంధించి తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. వ్యవస్థలో మార్పు తీసుకు రావడమే తమ లక్ష్యమని, అనర్హత అంశాన్ని స్పీకర్ పరిధిలో నుంచి తీసేసి ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి తీసుకు వస్తే న్యాయం జరుగుతుందన్నారు. ఇది సాధించేందుకు తమ పోరాటం ఆగదన్నారు.
కాగా, భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ, జలీల్ ఖాన్, చాంద్ భాషా, ఆదినారాయణ రెడ్డి, గొట్టిపాటి రవి కుమార్.. ఇలా పదమూడు మంది ఎమ్మెల్యేలు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి తరఫున గెలుపొందారు. వారు ఇప్పుడు సైకిల్ ఎక్కారు. మరో ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని, వైసిపిలో జగన్ ఒక్కడే మిగులుతారని టిడిపి నేతలు జోస్యం చెబుతున్నారు.
డి రాజాను కలిసిన జగన్
జగన్ బృందం సీపీఐ నేత డి రాజాను బుధవారం సాయంత్రం కలిసింది. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల అంశాన్ని, పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని ఆయనకు వివరించారు. భేటీ అనంతరం రాజా మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ తమ దృష్టికి తీసుకొచ్చిన అంశాలను పార్టీలో చర్చిస్తామని, ఫిరాయింపుల వ్యవహారాన్ని సీరియస్గా పరిగణిస్తామన్నారు.
పార్టీ మారిన వ్యక్తులు, ఆ పార్టీ ద్వారా వచ్చిన అన్ని పదవుల నుంచి తప్పుకోవాలని, చట్టంలోని లొసుగులను ఉపయోగించుకోవడం సరికాదన్నారు. పార్టీ ఫిరాయింపులనేవి కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితమైన అంశం కాదని, అన్ని రాష్ట్రాల్లోనూ ఇది సమస్యగా మారిందన్నారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఏం జరిగిందో ఏపీలోనూ అదే జరుగుతోందన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు తీసుకు రావాలన్నారు.